Thursday, January 24, 2013

మైనారిటీలే మనుషులు..వారికే మనో భావాలు!

ముస్లిం ల మనోభావాలు దెబ్బ తింటాయన్న "అంచనా" తో తమిళనాడు ప్రభుత్వం కమల హాసన్ విశ్వరూపం సినిమాని విడుదలకి ముందే నిషేధించింది.

మరి బ్రాహ్మణులని అవమానకరంగా చిత్రీకరించి, విడుదల అయ్యాక కోర్టు కేసుల వరకు వెళ్ళినా కూడా ఆ చిత్రం పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.

ఏ ప్రభుత్వమైనా కూడా మైనారిటీలకే కొమ్ము కాస్తుంది అనటానికి ఇంతకన్నా తార్కాణం కావాలా?

Friday, January 18, 2013

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా !

 
మన రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వుంది అంటే, అది కేవలం డిల్లీకి బ్రాంచి ఆఫీసుగా మాత్రమె నడుస్తుంది అన్న విషయం మనకి తెలియంది కాదు. ఇప్పటికీ భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా మోయనంతగా గాంధీ, నెహ్రు వంశీకుల పేర్లని మన ప్రభుత్వ పధకాలకీ, విమానాశ్రాయాలకీ, యాత్రా స్థలాలకీ మనం మోస్తున్నాం. మన తెలుగు ప్రధాని పీ వీ పేరుని మనమే మర్చి పోయి మరీ, గాంధీ-నెహ్రు వంశీకుల భజన చేసి తరించాం. ఇంత చేసిన మనకి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? ఇవ్వ బోతోంది? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎన్ని సీట్లు వస్తాయి - విడ దీస్తే ఎన్ని సీట్లు వస్తాయి అన్న లేక్కలేసుకుంటోంది తప్ప సగటు తెలుగు వాడి మనసులో ఏముందో ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేసిందా? మన తెలుగు వారి ఆత్మ గౌరవమే నినాదంగా రాజకీయాల్లో ప్రవేశించి, గాంధీ-నెహ్రూ వంశీకుల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ రాజ్యాన్ని అంతమొందించి తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్ టీ ఆర్ వంటి నాయకుడు కనీసం ప్రతిపక్షంలో ఐన నేడు లేకపోవటం మన దురదృష్టం. కేవలం రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్ల ప్రాతిపదికగా రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తేల్చ బూనటం దారుణం. కాంగ్రెస్ మనసులో ఏముందో అన్నది సీమాంధ్ర ప్రతినిధులతో వాయలార్ రవి అన్న మాటల్లోనే తెలిసి పోయింది. ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక రాజకీయ పార్టీ వ్యుహాలకి అనుగుణంగా నిర్ణయించటం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రాంతాలకి అతీతంగా తెలుగు వారందరూ రాష్ట్ర విభజనకి జరుగుతున్న కుట్రకి తెర దించాలి. ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? తాను జీవించి వున్నప్పుడు జరిగిన వెన్ను పోటు కన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి స్వర్గంలో ఎన్.టీ.ఆర్. ఆత్మ క్షోభిస్తుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
(నేడు ఎన్.టీ.రామారావు వర్ధంతి)

Wednesday, January 2, 2013

అఖిల పక్షం మిధ్య...తెలంగాణా మిధ్య !

గత నెల 28వ తెదీన దేశ రాజధానిలో జరిగిన అఖల పక్ష సమావేశం తర్వాత ఏదో అద్భుతం జరిగిపోతుందన్న హడావిడి రాష్ట్రంలో రాజకీయ పక్షాలు చేస్తున్నాయి.   కేవలం ఎఫ్.డీ.ఐ. బిల్లుని గట్టేక్కించుకొవటానికే,   తెలంగాణా ప్రాంత ఎంపీలు జారి పోకుండా అఖిల పక్షం ఎరని కాంగ్రెస్ అధిష్టానం వేసిందన్నది సుష్పష్టం.  అయినా కేంద్రంలో హొమ్ మంత్రి మారినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ పక్షాల అభిప్రాయాలు తెలుసుకోవటానికి సమావేశం అవసరమా?   రాష్ట్ర విభజన అన్నది కేవలం రాజకీయ పక్షాలు మాత్రమే నిర్ణయించే విషయం కాదు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలే కాక, సమాజం లోని అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలని సేకరించి-క్రోడీకరించి-విశ్లేషించి శాస్త్రీయంగా ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా, హొమ్ మంత్రికి సమావేశం అవసరమా?  ఇటువంటి నాన్చుడు వ్యవహారాలతోనే రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ మంట గలిపింది. సూటిగా ఆలోచిస్తే......ఏకాభిప్రాయం అనేది లేకుండా (రాజకీయులే కాదు, సమాజంలోని అన్ని వర్గాలలోను) రాష్ట్ర విభజన సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో భిన్న వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేనే లేదు..రానే రాదు. అటువంటప్పుడు ప్రత్యెక రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు. శ్రీకృష్ణుడు తన నివేదికలో చూపిన  ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలు చేయటమే కేంద్రం తక్షణ కర్తవ్యం.