Sunday, September 29, 2013

సుష్మా స్వరాజ్ శుష్క ప్రసంగం !

మహబూబ్ నగరులో జరిగిన ప్రజా గర్జన సభలో మాట్లాడుతూ  ఒక్క చుక్క రక్తం చిందకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చేసామని గొప్పలు చెప్పుకున్నారు సుష్మా స్వరాజ్.   అయితే  తాము ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల నేపధ్యానికీ,  ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ విభజన నేపధ్యానికి వున్న తేడా ఆవిడకి తెలియకపోవటం ఆశ్చర్యం.   

1) 2000 సంవత్సరంలో ఎన్డీఏ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటానికి ముందు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాసన సభల్లో విభజన కోసం ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపటం జరిగింది.  అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో నిమిత్తం లేకుండా దొడ్డి దోవన కేంద్రం స్వంతంగా వాటిని ఏర్పాటు చేయడమనే  దుష్ట సాంప్రదాయం అమలు జరగలేదు. 

2) మూడు రాష్ట్రాల విషయంలో కూడా విభజన జరిగిన రెండు ప్రాంతాల పరస్పర అంగీకారంతోనే విభజన ప్రక్రియ జరిగింది తప్ప ఏదో ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ రాష్ట్రాలని ఏర్పాటు చెయ్యలేదు. 

3) విభజన వల్ల ఏర్పడ్డ మూడు కొత్త రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి తప్ప  సంపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధాని ని కాజేస్తూ తల్లి రాష్ట్రాన్నేతన్ని తగలేసే విధంగా   ఏ ఒక్క రాష్ట్రమూ ఏర్పాటు చేయబడలేదు.  

విభజనల నేపధ్యంలో ఇన్ని వైరుధ్యాలు వున్నా కూడా  చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయటంలో వారికే పేటెంటు హక్కు వున్నట్లు మాట్లాడుతున్న సుష్మా స్వరాజ్ గారు వారు ఏర్పాటు చేసిన రాష్ట్రాల వైభోగం ఎలా వుందో ఒక్కసారి  పునః పరిశీలించుకుంటే బాగుంటుంది.   వరదల సమయంలో ఉత్తరాఖండ్ చేతులెత్తేసింది. పూర్తిగా బయటనుంచి వచ్చిన సాయంతోనే వరద బాధితులకి సహాయం అందింది. చత్తీస్ ఘడ్ లో సల్వాజుడుం, కాంగ్రెస్ నాయకులని నక్సలైట్లు ఊచకోత కోసినా అడిగే దిక్కు లేదు.. ఇంక జార్ఖండ్ సంగతి చెప్పక్కరలేదు. 13 సంవత్సరాల కాలంలో 5 మంది ముఖ్య మంత్రులు 9 సార్లు గద్దెనెక్కడమే గాక మధ్యలో 3 సార్లు రాష్ట్రపతి పాలనకు గురి అయ్యింది. నిజానికి  భారత దేశంలో ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అన్నది failed concept.  ఇక భారత దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు  అన్నది రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రాలుగా తప్పితే ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగం లేనే లేదు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సీమాంధ్ర ఉద్యమ ఉధృతికి కాంగ్రెస్ తోక ముడిచినట్లే  బీజేపీ కూడా పంధా మార్చుకోక తప్పదు.  మార్చుకోని పక్షంలో సుష్మా స్వరాజ్  డిసెంబరు నెలలో గర్జనలు, భేరీలు, నగారాల తో  ఉద్యమానికి సిద్ధం కావచ్చు. 

సమైక్య ఉద్యమం లో అధిష్టానం కోవర్టులు ఎవరు ?


తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదు అంటూ కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చింది చంద్ర బాబే! రాష్ట్ర విభజనకి పూర్తి బాధ్యత తెలుగు దేశం పార్టీ దే ! ఇప్పుడు చంద్ర బాబు ఎన్ని యాత్రలు, పర్యటనలు చేసినా సీమాంధ్రులు నమ్మరు
  --  కాంగ్రెస్,  వైఎస్ఆర్ కాంగ్రెస్     

అధిష్టానం ఏం నిర్ణయించినా సరే అని ముందు చెప్పి ఇప్పుడు విభజన ప్రతిపాదన జరిగిన  ఇన్ని రోజుల తరువాత సమస్యలు ఏకరువు పెట్టటంలో అర్ధం ఏమిటి ?  ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న గేమ్ ప్లాన్ లో భాగమే.. కేంద్రం ఆడమన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారు..
 -- వై ఎస్ ఆర్ కాంగ్రెస్,  టీడీపీ   

సమైఖ్యాంధ్ర ముసుగులో జగన్ కేంద్ర కాంగ్రెస్ కి రాష్ట్ర విభజనకి సహకరిస్తున్నారు.  అందుకే సీమాంధ్ర శాసన సభ్యుల సంఖ్యని తగ్గించే ఆలోచనతో తమ పార్టీ శాసన సభ్యుల రాజీనామాలు ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేసారు.
  -- టీడీపీ,  సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు  

 గత అరవై రోజులుగా సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఏక ధాటిగా సమైక్యం కోసం మహోగ్రంగా వుద్యమిస్తుంటే -   ప్రజల ఆశలు, ఆకాంక్షలకి అనుగుణంగా వారికి మార్గ దర్శనం చేయ వలసిన ప్రధాన రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ఇది!

గత రెండు నెలలుగా జీతాలు లేకుండా ఉద్యోగులు/కార్మికులు, విద్యాలయాలు నడవకుండా విద్యార్ధులు, ఇంకా పాలనా పరమైన సౌకర్యాలు అందక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ కూడా - కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న స్ఫూర్తితో వుద్యమిస్తుంటే - ప్రధాన పార్టీలకి చెందిన నాయకులు మాత్రం పదవులని అంటి పెట్టుకొని రాజీడ్రామాలు ఆడుతున్నారు. (హరికృష్ణ మినహాయింపు).  ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో కేంద్రం సాంప్రదాయ పద్ధతులకి తిలోదకాలు ఇచ్చి దొడ్డి దారిలో ఐనా రాష్ట్రాన్ని విభజించి పారేయాలని కుట్రలు పన్నుతున్న దశలో ఈ రాజకీయ పార్టీలు/నాయకులలో ప్రజల పక్షాన నిజాయితీగా ఎవరు నిలబడతారు అన్నది ప్రశ్నార్ధకమే !   రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే జరుగుతున్న ఉద్యమం దెబ్బకి కేంద్రం తోక ముడిచింది అన్నది స్పష్టం.  ఇటువంటి కీలక సమయంలో ఏ పార్టీకి చెందిన నాయకుడైనా రాజీనామా ఆమోదింప జేసుకొని ముందుకి వస్తే వారిని ఉద్యమం లో భాగస్వాములని చెయ్యాలే తప్ప సారధ్యం అప్పగించరాదు. ఒకసారి ఉద్యమ సారధ్యం రాజకీయుల చేతిలోకి వెళ్లిందంటే అంతే సంగతులు.. ఖచ్చితంగా శల్య సారధ్యం వహించి  పుట్టి ముంచేయటం  ఖాయం.  ఈ విషయం దృష్టిలో వుంచుకొని ఉద్యోగులు, ప్రజలు కూడా రాజకీయుల ప్రమేయం లేకుండా స్వంత మార్గంలోనే ముందుకు సాగితే సమైక్య రాష్ట్ర సాధన తధ్యం... విజయోస్తు ! 

Saturday, September 28, 2013

అపశ్రుతులు పలుకుతున్న వీణ !

నేటికి అరవై రోజులుగా సీమాంధ్ర లో సమైక్య రాష్ట్రం కోసం మహోగ్రంగా ఉద్యమం జరుగుతోంది. ఏ రాజకీయ నాయకుల-జాక్ ల తోడ్పాటు లేకుండా ప్రజలే స్వచ్చందంగా తమ రాష్ట్ర సమైక్యం కోసం సాగిస్తున్న ఉద్యమం న భూతో అని చెప్పాలి.  రోజూ కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చి వుద్యమించినా హింసాత్మక ఘటనలకు, రెచ్చ గొట్టే ప్రకటనలకు తావు లేకుండా తమకు తోచిన పద్ధతుల్లో శాంతియుతంగా నిరసన సాగిస్తున్న సీమాంధ్రుల గుండె మంట ఓ కామెడీగా కనిపిస్తోంది కోటి రత్నాల వీణకి!    

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_27.html

అంతేలే మరి! ఉద్యమం అంటే వారి దృష్టిలో క్రింది విధంగా  వుండాలి...ఇతర పద్ధతులన్నీ వారికి కామెడీ గా కనపడటంలో ఆశ్చర్యం ఏముంది?

 

 
 


 


స్టార్ బ్యాట్ మన్ చెలరేగాడు !


అధిష్టానం అరాచకానికి సిఎం కిరణ్ చెక్ చెప్పారు. హైకమాండ్ ఆగ్రహిస్తే తక్షణం తన పదవి ఊడుతుందని తెలిసీ కిరణ్ కుమార్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.  తలుపులు మూసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని నిరూపించారు.  మనది ప్రజాస్వామ్య దేశం... ఇక్కడ ప్రజలే సుప్రీం! అటువంటి  మన రాష్ట్ర ప్రజలకి తమ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో తెలియకుండా రెండు నెలల పాటు సుప్త చేతనావస్థలో ఉంచిన కేంద్రం అవివేక నిర్ణయం పై నిప్పులు  చెరిగారు ముఖ్య మంత్రి! సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రి అంటూ వక్రంగా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ కి కూడా గూబ పగిలే సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి అభినందనీయుడు. తెలుగు వారి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తెలుగేతర ప్రాంత నాయకులు అందరూ కత్తులు పట్టుకుని సిద్ధమైన సమయంలో ఈ స్థాయి ప్రతిఘటన అత్యంత ఆవశ్యకం.      అరవై రోజులుగా సీమాంధ్ర లో జరుగుతున్న ఉద్యమం పట్ల ఉదాసీనంగా వున్నట్లు నటిస్తూ అటు విభజన నోట్ వైపు కూడా అడుగు ముందుకు వేసే దమ్ము లేని కేంద్రానికి సరైన ఝలక్ ఇచ్చారు కిరణ్!  తమ స్వంత పార్టీ ముఖ్య మంత్రిని సైతం విశ్వాసంలోకి తీసుకోవటం చేతకాని  కేంద్రానికి విభజన దిశగా అడుగులు వేసే హక్కు ఎంత మాత్రం లేదు.  మెజారిటీ   ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా దొడ్డి దారుల్లోనైనా రాష్ట్రాన్ని విభజించెయాలని పంతం పడుతున్న కేంద్రానికి సరైన బుద్ది చెప్పాలి.   కేంద్రం ఆఖరి బంతి వేసేసిందని, మాచ్ ముగిసిపోయిందనీ వేర్పాటు వాదులు మురిసిపోతున్నారు. అయితే కేంద్రం వేసింది నో బాల్ అనీ, కేంద్రం హిట్ వికెట్ అయ్యిందనీ  అంపైర్లు (ప్రజలు) డిక్లేర్ చేస్తున్న విషయం  వారు గ్రహింపులో  వుంచుకుంటే  సంతోషం.

Thursday, September 26, 2013

ఇంట్లో ఈగల మోత ! : దిగ్విజయ్ సింగ్

ముఖ్య మంత్రిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలని సుద్దులు చెప్తున్న దిగ్విజయ్ సింగ్ తాను ఎలా ప్రవర్తిస్తున్నారో ముందు తెలుసుకోవాలి.  తెలంగాణా ప్రాంతానికి అనుకూలంగా విభజన ప్రతిపాదించటమే గాక సీమాంధ్ర నాయకుల విన్నపాలని సైతం పెడచెవిన పెడుతూ రోజుకో సారి తెలంగాణా తధ్యం అంటూ ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేసేస్తున్నారు. తాటాకు చప్పుళ్ళ లాంటి దిగ్విజయ్ మాటలని ఉద్యోగులు కూడా ఖాతరు చెయ్యటం మానేశారు!  విభజన ప్రతిపాదనతో ఎన్జీఓ ల భవిష్యత్తు అంధకార బంధురం చేసేసి - వారు ఉధృతంగా సమ్మెకి దిగాక - ఏమీ ఎరగని నంగనాచిలాగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా, సమ్మె విరమించండి అని ప్రకటించటం విడ్డూరం!    సొంత రాష్ట్రం లో ఠికానా లేక కాంగ్రెస్ కోర్ కమిటీలో కాలక్షేపం చేస్తూ అమ్మ దయతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కి ఇన్ చార్జి గా నియమితులైన దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన దగ్గరనించి చిత్త చాంచల్యం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన సొంత రాష్ట్రంలో మొహాన తలుపు వేసి జ్యోతిరాదిత్య సింధియా విలేఖరుల సమావేశం నిర్వహిస్తే కిక్కురుమనని దిగ్విజయ్ తన ప్రతాపాన్ని సీమాంధ్ర నాయకుల పై మాత్రం చూపిస్తారు.
 ఒక పార్లమెంటు సభ్యురాలిని టంచ్ మాల్ అంటూ వెకిలిగా మాట్లాడిన పెద్ద మనిషి దగ్గరికి సీమాంధ్ర నాయకుల సతీమణులు వెళ్ళటం అర్ధం లేని పని. తన ప్రవర్తనకి తగ్గట్లే వారిని కూడా అవమానించి పంపాడాయన! మహిళల విషయం వదిలేస్తే మతం విషయంలోనూ దిగ్విజయ్ ది  అవాంచనీయ ధోరణే!  తాజాగా మధ్య ప్రదేశ్ లోనే బీజేపీ సమావేశానికి పదివేల బురఖాలు పంపిణీ అంటూ తల తిక్క వ్యాఖ్యానం చేసి పొలిసు కేసు ఎదుర్కుంటున్నారు. 

http://indiatoday.intoday.in/story/police-complaint-against-digivjaya-singhs-for-his-false-burqua-claims/1/311876.html

ఇంతటి ఘన చరిత్ర గల పెద్ద మనిషి ఆధ్వర్యంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం ప్రకటించాక కూడా ముందుకి సాగే దమ్ము లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రగతి తో దారుణమైన విధంగా ఆటలాడుకుంటోంది.  అసలు ఇంట గెలవలేని దిగ్విజయ్ రచ్చ గెలుస్తాడని కాంగ్రెస్ ఎలా భావించింది? తెలుగు వారి పట్ల కేంద్రం చూపుతున్న చిన్న చూపుకి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు పరాకాష్ట అని చెప్పాలి.  

Wednesday, September 25, 2013

సు మోటో గా చర్యలు తీసుకుంటే తెలబాన్లు అందరూ జైల్లోనే !


తెలంగాణా ని కేంద్రం ప్రకటించేసింది! ఇంక 100 రోజుల్లోనో / నెలల్లోనో ఎలాగూ వచ్చేస్తుంది. వేర్పాటువాదులు ప్రశాంతంగా ఉండవచ్చు కదా!  అన్యాయం జరిగింది సీమాంద్రులకి ! ఎక్కడో తంతే మూతి పళ్ళు రాలినట్లు - విడిపోతామన్నది వేర్పాటు వాదులు, రాష్ట్రాన్ని రాజధానిని కోల్పోమన్నది సీమాంద్రులని!  అడ్డగోలు నిర్ణయం ఏకపక్షంగా జరిగినప్పుడు ఉద్యమం తలెత్తటం సహజం. రాజకీయ నాయకులు మొహం చాటేసినా ప్రజలు,ఉద్యోగులు స్వచ్చందంగా సాగిస్తున్న ఉద్యమం పట్ల తెలబాన్లు ఉలికులికి పడుతున్నారు.  ప్రారంభమైన రోజు నుంచి శాంతియుతంగా, ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు లేకుండా సాఫీగా జరుగుతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పట్ల తెలంగాణా నాయకులు వ్యాఖ్యానాలు చేస్తున్న తీరు అభ్యంతరకరం. ముఖ్యంగా ఎన్జీఓ నాయకుడు అశోక్ బాబు గురించి వారు చేస్తున్న వ్యాఖ్యలు వారి ఓపలేని తనాన్నే సూచిస్తాయి. సేవ్ ఆంద్ర ప్రదేశ్ సమావేశం హైదరాబాదులో జరుపుకోవటానికి తెలబాన్లు ఎన్ని అడ్డంకులు కల్పించినా సమావేశాన్ని శాంతియుతంగా, అత్యంత సంయమనం పాటించి అశోక్ బాబు నడిపించిన తీరు జాతీయ మీడియా సైతం ప్రశంసించింది.  ఆ తరువాత జరిగిన హిందూపూర్ సభ వరకు కూడా అశోక్ బాబు ఎక్కడా తెలంగాణా నాయకులని తూలనాడింది లేదు.  కేవలం విభజన ప్రతిపాదన తెచ్చిన కేంద్రాన్ని విమర్శించాడు తప్ప తెలంగాణా ప్రాంత నాయకులని పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని శ్రేణులని ఒకటికి పది సార్లు హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. . మరి ఈనాడు హరీష్ రావు గారు అశోక్ బాబు పై సు మోటో గా చర్యలు తీసుకోవాలని సెలవిస్తున్నారు!  ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించదని చెప్పటమే సు మోటో గా విచారించాల్సిన నేరమైతే - హరీష్ రావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని నాలుక కోస్తానంటూ  పత్రికా ముఖంగా హెచ్చరించారు.   ఆయనే కాదు తెలంగాణా ఎన్జీఓ నాయకుడు సైతం అశోక్ బాబు నాలుక కోస్తానని ప్రకటించారు.  సెప్టెంబర్ 7 వ తేదీ సమావేశానికి వచ్చిన వాళ్ళని చితక బాదతామని ఉస్మానియా విద్యార్ధి నాయకుడు పిడమర్తి రవి టీవీ కెమెరాల సాక్షిగా బెదిరించారు.  ఇలా ఒకటా రెండా...చెప్పుకుంటూ పొతే తెలబాన్ నాయకుల నోటి దురుసుకి ఉదాహరణలు  కోకొల్లలు. సు మోటో గా న్యాయ వ్యవస్థలు చర్యలు తీసుకొని వుంటే ఈ పాటికి తెలబాన్ నేతలందరూ శ్రీ కృష్ణ జన్మ స్థానంలోనే వుండే వారు. అసలు రాష్ట్రం సమైక్యం గానే ఉందన్న ధీమా తో గత నాలుగేళ్ళుగా తెలబాన్లు చేస్తున్న అసత్య ప్రచారాలని ఖండించక పోవటం సీమాంధ్ర నాయకుల పొరపాటు. భావోద్వేగాల పేరుతొ ఎన్ని అవాకులు చెవాకులు పేలినా చూసీ చూడనట్లు వదిలెయ్యటం గ్రహ పాటు. మొగుణ్ణి కొట్టి మొగసాలకేక్కినట్లు సహనం సంయమనం చూపిన సీమాంధ్రుల పైనే సు మోటో చర్యలకి తెలబాన్ నాయకులు డిమాండ్ చెయ్యటం గురువింద గింజ సామెత ని గుర్తు చేస్తుంది. గతం గతః .. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదని సామెత!  ఇక ముందు తెలంగాణా నాయకులు వుట్టి పుణ్యానికి నోరు పారేసుకుంటే సంయమనం చూపాల్సిన పని లేదు.  న్యాయ బద్దంగా అడ్డు కట్ట వేస్తె కానీ వారి నోళ్లకి తాళం పడదు..            

Sunday, September 22, 2013

పంజరంలో చిలుక ప్రజాభీష్టాన్ని నొక్కేస్తోందా ?

లోక్ సభలో యూపీఏ ప్రభుత్వానికి వున్నది బొటా బొటి మెజారిటీ.. ఎఫ్ డీ ఐ బిల్లు లేదా ఆహార భద్రతా బిల్లు మొదలైనవన్నీ గట్టేక్కించు కోవటానికి నానా తంటాలు పడింది యూపీఏ.  ఇంత స్వల్ప మెజారిటీ తో ఉన్న ప్రభుత్వం తెలంగాణా పై అంత గట్టి నిర్ణయం ఎలా తీసుకుంది ?  స్వంత పార్టీ లోనే ఏకాభిప్రాయం లేకుండా విభజనకి అంత మొండిగా ఎలా సాగుతోంది?
 సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు వారి సతీ మణులని  రాష్ట్రపతి దగ్గరకి సమైక్య రాష్ట్రం కోసం విజ్ఞప్తితో పంపారే గానీ వారెందుకు వెళ్ళలేదు?  తమని గెలిపించిన ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా విభజన ప్రతిపాదన జరిగినపుడు ఇదే మంత్రులు-పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి రాజీనామాలు ఇచ్చేస్తే  ప్రభుత్వం సంక్షోభంలో పడదా?  మెజారిటీ లేక ప్రభుత్వమే కూలితే ఇంక విభజన బిల్లు వచ్చే పనే లేదు.  అయినా సీమాంధ్ర మంత్రులు-పార్లమెంటు సభ్యులు అంత  ధైర్యం ఎందుకు చేయలేక పోతున్నారు ?   కారణం ఒకటే కనిపిస్తోంది.  అదే సిబీఐ !  సుప్రీం కోర్టు భాషలో కేంద్ర ప్రభుత్వం అనే పంజరంలోని చిలుక !
 ములాయం సింగ్ బయట నుండి మద్దతు ఇచ్చినా, సీమాంధ్ర నాయకులు కిమ్మనకుండా అధిష్టానానికి సలాం కొట్టినా సీబీఐ  భయమే కారణం అయి ఉండవచ్చు.  సీమాంధ్ర మంత్రులు, నాయకులు అందరికీ స్వంత వ్యాపారాలు, తరాలకి సరి పడ్డ ఆస్తులు వున్నాయి.  అధిష్టానాన్ని ఎదిరించి పోరాడిన జగన్మోహన రెడ్డి పరిస్థితి చూసాక సీమాంధ్ర నాయకులకి జడుపు జ్వరం వచ్చినట్లుంది.  అందుకే నియోజవర్గాల్లో ప్రజలు తరిమి తరిమి కొడుతున్నా హస్తినలో దాక్కుంటున్నారే తప్ప అధిష్టానాన్ని ఎదిరించే సాహసం చెయ్యట్లేదు... దీని వల్ల వాళ్ళ స్వంత ప్రయోజనాలు కాపాడుకున్నా,  సీమాంధ్ర ద్రోహులుగా చరిత్ర హీనులుగా మిగిలి పోతున్నారన్న విషయం వారు మర్చి పోతున్నారు.  జీతాలు అందక పోయినా మొక్కవోని దీక్షతో 45 రోజులుగా ఉద్యమిస్తున్న ఎన్జీఓ లకి వున్న నిబద్ధత కూడా సీమాంధ్ర రాజకీయులకి లేక పోవటం సిగ్గు చేటు..                 

Saturday, September 21, 2013

అరిచే కుక్క కరవదు !

52 రోజులుగా సీమాంధ్ర ప్రాంతమంతా ఊరు వాడ ఏకమై చేస్తున్న మహోద్యమం తో కేంద్రానికి కాలు చెయ్యి ఆడటం లేదు.  అడ్డగోలు విభజన ప్రతిపాదించి అడుసు తొక్కిన కాంగ్రెస్ ఇప్పుడు కాళ్ళు ఎలా కడుక్కోవాలో తెలీక సతమతమవుతోంది. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమన్న బీజేపీ కూడా తాము రాష్ట్రాలు ఇచ్చినపుడు ఎటువంటి గొడవలు జరగలేదని, ఇప్పుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళ్ళటం కష్టమే అని సన్నాయి నొక్కులు మొదలు పెట్టింది.  కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వక పొతే తాము ఇచ్చి తీరతామని చెప్పిన బీజేపీ కూడా మడమ తిప్పెయ్యటంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది.     ఆంధ్రులని ఆరంభ శూరులుగా జమ కట్టి  ఎక్కువ కాలం   వుద్యమించలెరన్న తప్పుడు అంచనాతో ఏకపక్ష విభజనకి ఒడి గట్టిన కేంద్రం, ఇప్పుడు   పరువు కాపాడుకోవటానికి టీవీల ముందు  రోజుకో  నాయకునితో  తెలంగాణా పై వెనక్కి తగ్గేది లేదన్న ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేయిస్తోంది.  ఓటి కుండకి మోతలెక్కువ అన్నట్లు  వెనక్కి వెళ్ళలేం అని ఎంత మంది కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే --  అంత ముందుకి సమైక్య ఉద్యమం ఉరకలేస్తోంది ! రాజకీయ నాయకుల ప్రమేయం అన్నది లేకుండా కేవలం ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా నడిపిస్తున్న ఇటువంటి ఉద్యమం న భూతో అనే చెప్పాలి.  
నిజంగా కాంగ్రెస్ కి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే వుంటే విభజన ప్రతిపాదన ఏకపక్షంగా చేసేదే కాదు!  సీమాంధ్ర లో ఉద్యమం వస్తే బలగాల సాయంతో అణచి వేసి విభజన పై ముందుకు సాగుదామనుకున్న కేంద్రానికి  -  ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా కొనసాగుతున్న సమైక్య ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా పాలుపోవట్లేదు.. పదవులని వదలి పెట్టకుండా సీమాంధ్ర నాయకులు మొహం చాటేసినా కూడా నాయకత్వ లేమి అన్నది కనపడకుండా సాగుతున్న ఉద్యమ ఉధృతికి కేంద్రం తల వంచక తప్పదు.    జూలై 30 ప్రకటనకి ముందు 15 రోజుల్లో చక చకా పావులు కదిపేసి  నిర్ణయం ప్రకటించేసిన కాంగ్రెస్ 52 రోజులైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రవర్తించడం ఖచ్చితంగా వెనకడుగు వేయడమే!  కేంద్రం మెడలు వంచి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఉద్యమించే సత్తా తెలుగు వాని సొంతం.  ఆ మంచి రోజు ఎంతో దూరంలో లేదనటంలో ఏ మాత్రం సందేహం లేదు..     

Wednesday, September 18, 2013

కోదండ రాం కామెడీ !

పనేమీ చేయకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న జీతం  ఒంటికి ఎలా పడుతున్నదని తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు!  దయ్యాలు వేదాలు వల్లించటం, గురువింద గింజ తన వెనుక నలుపు ఎరగదు వంటి సామెతలు కోదండరాం కు బాగా వర్తిస్తాయి. విద్యార్ధులకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపక వృత్తి లో వున్న ఆయన గత నాలుగేళ్ళుగా   తన ఉద్యోగానికి ఏమి న్యాయం చేసారో ముందు చెప్పాలి. పూర్తి కాలం ఉద్యమానికే కేటాయిస్తున్నప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉద్యమంలో పాలు పంచుకుంటే హుందాగా వుండేది!  కానీ ఏ పనీ చెయ్యకుండా నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ మరో పక్క ముఖ్య మంత్రి  ప్రజలకి సమాధానం చెప్పాలనటం విచిత్రం !  

అయినా,  జాగో-భాగో   అంటారు. తరిమి కొడతాం అంటారు. నాలుకలు కోస్తాం అంటారు. విగ్రహాలు పగల కొడతారు.  శాసన సభ్యులని చితక కొడతారు. తేరగా జీతాలు తీసుకుంటారు.  ఉద్యమం ముసుగులో ఏమి చేసినా తప్పు కాదు అన్నది తెలబాన్ల ప్రాధమిక సూత్రం !  ఆ సంగతి మర్చి పోయి ఏదేదో రాసేశాను.. మన్నించాలి !       


Tuesday, September 17, 2013

ఏది ఉద్యమం?


రాజకీయ నాయకుల్లో అజాత శత్రువు ఎవరంటే జేపీ!  జేపీ అంటే నిఖార్సైన మేధావి .. నిజాయితీకి మారు పేరు!   తెలంగాణా ప్రాంతపు శాసన సభ్యుడైనా,ఏనాడూ కూడా ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రవర్తించకుండా  సహేతుకంగా మాట్లాడే వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు.  గతంలో అసెంబ్లీలో  కేవలం గవర్నరు ప్రసంగం అడ్డుకోవటం సరి కాదు అన్నందుకే తెలబాన్లు శాసన సభ ప్రాంగణంలో ఆయనకు చేసిన సన్మానం ఇది.. ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ ఆయన పై చేయి చేసుకున్నా అది భావోద్వేగంతో తన్నడమే తప్ప తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు.  పైగా ఈ సన్మానం ఆయనకి జరగాల్సిందే అని సెలవిచ్చారు.. 

http://timesofindia.indiatimes.com/city/hyderabad/JP-deserved-attack-says-TRS-MLA/articleshow/7518703.cms  


మరి ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉధృతంగా వున్న సమయంలో ఆయన  కర్నూలు, అనంతపురం వచ్చి జనాలను జాగృతం చేస్తానంటూ చేపట్టిన తెలుగు తేజం కార్యక్రమానికి కూడా సమైక్య సెగ తగిలింది.  అయితే సమైక్య వాదులు తెలబాన్ల వలే  ఆయనను  కొట్టలేదు కానీ తమ నిరసన  గట్టిగా తెలియజేసి వెనుకకి మరలేలా చేసారు.   



ఏది అసలైన ఉద్యమం ?  ఏది అసలైన ఉద్యమ స్ఫూర్తి?  సీమాంధ్రులది పెయిడ్ ఉద్యమం అంటూ నీచంగా మాట్లాడుతున్న తెలబాన్లకి అలా అనే హక్కు అసలు ఉందా?