Monday, December 31, 2012

"అమానత్" వివరాలు వెదకకండి !

2012  సంవత్సరం అత్యంత విషాదకర సంఘటన తో ముగుస్తోంది.. 13 రోజుల పోరాటం అనంతరం ఢిల్లీ అత్యాచార బాధితురాలు కన్ను మూసింది... ఆమె కుటుంబానికే గాకే యావత్ దేశానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు విషాద సంఘటన కన్నా మీడియా వాళ్ళు వచ్చి కాకుల్లా పొడుచుకు తినే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే ఆయా కుటుంబ సభ్యులకి వేదన గా సంభవిస్తుంది. ఇక్కడ గుడ్డిలో మెల్ల లాంటి విషయమేమిటంటే-- ప్రభుత్వ ఆంక్షల వల్ల కావచ్చు, లేదా స్వయం నియంత్రణ కావచ్చు..వారి వ్యక్తిగత వివరాల జోలికి ఏ మీడియా కూడా తొంగి చూడలేదు.  అమానత్, నిర్భయ, దామిని వంటి మారు పేర్లతోనే సమాచారం అందించారు తప్ప వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా వుంచటం హర్షణీయం ఇంకా అభిలషణీయం కూడా.
జరిగిన దారుణానికి పరిహారంగా లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాలని డిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కానీ అదే సమయంలో వారి గోప్యత కి భంగం వాటిల్లకుండా కూడా సరైన చర్యలు తీసుకోవటం అత్యంత ఆవశ్యకం.   అలాగే నిందితులకి విధించాల్సిన శిక్ష విషయంలో కూడా ఫేస్ బుక్ లో నేను చూసిన ఒక సూచన..
"If Government can send the victim to Singapore for better treatment, I strongly suggest they should send the accused to Saudi Arabia for better justice !!"
నిజమే కదా! మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని సింగపూర్ తరలించిన ప్రభుత్వం..మెరుగైన న్యాయం కోసం నిందితులని సౌదీ అరేబియా కి అప్పగిస్తే బాగుంటుంది..


Sunday, December 9, 2012

ఆంధ్రావనికి నేడు విద్రోహ దినం..


పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి మూడేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది.... పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసి, ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మళ్ళీ అఖిల పక్షం అన్న నాటకానికి తెర లేపింది. ఎఫ్ డీ ఐ బిల్లు ఆమోదం పొందటంలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండటానికే తెలంగాణా ఎంపీ లని బుజ్జగించటం కోసం, రాష్ట్రంలో చల్లారిన వేర్పాటు వాదాన్ని మళ్ళీ రగిలించటానికి అఖిల పక్షం డ్రామాని మొదలు పెట్టింది. అసలు రాష్ట్రాన్ని విడ గొట్టాలా ఒద్డా అన్నది నిర్ణయించటానికి రాజకీయ పార్టీలకి వున్న హక్కు ఏమిటి? రాష్ట్రమంటే కేవలం రాజకీయులే కాదు...అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని పరిగణన లోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి, కూలంకషంగా పరిశోధించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఏమైంది? శ్రీకృష్ణుడు నివేదించిన నివేదికలోని ఆరో అత్యుత్తమ పరిష్కారాన్ని అమలు చేయటానికి రాజకీయ పార్టీలకి అభ్యంతరాలేమిటి?  కేవలం వోటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేమీ కాదు. 2014 లో తాము  ఎలాగు అధికారంలోకి రామని నిర్ణయించేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈలోగా రాష్ట్రాన్ని వీలైనంతగా తగల పెట్టి వెళ్ళాలనే కుట్రని అమలు జరుపుతోంది. రాష్ట్రంలోని ప్రతి పధకానికి ఇందిరా, రాజీవ్ పేర్లని మోస్తున్న తెలుగు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కానుక ఇది. కనీసం ఒక్క పధకానికైనా లేదా పర్యాటక ప్రాంతానికైనా మన తెలుగు ప్రధాని పీవీ పేరు ఉందా? ప్రాంతాలకి అతీతంగా ఈ కుట్రని ఎదుర్కోవాల్సిన అవసరం తెలుగు వారందిరికీ ఇప్పుడు వుంది...కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమె కాదు..విభజన వాదం పేరుతొ రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న రాజకీయులందరినీ తరిమి కొట్టి తెలుగు వారు తామంతా ఒక్కటే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు వుంది.
లేని పక్షంలో బ్రిటిష్ వారికన్నా అధ్వాన్నంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అమలు పరుస్తున్న కాంగ్రెస్ రాజకీయాలకు బలైన చరిత్ర హీనులుగా మనం మిగిలి పోతాం.