Tuesday, April 27, 2010

ఆది కేశవుడి ఆగడాలకు అడ్డు లేదా?

             కేవలం తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసమే పార్టీ ఫిరాయించి ఆ పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు దేవస్థానం విషయంలో చేస్తున్న ఆకృత్యాలకు  అంతే లేకుండా పోతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అనంత స్వర్ణ మయం పధకానికి హై కోర్టు అడ్డు చెప్పినా కూడా ఇంకా ఆ పధకం పట్ల  ఆయన ప్రత్యెక శ్రద్ధ చూపడం  పట్ల ఎవరికైనా అనుమానాలు రాక తప్పదు. తాజాగా నిన్న - సామాన్య భక్తులందరికీ కొండ ప్రవేశం నిషిద్ధమైన వేళలో - తానె దగ్గరుండి అంబానీ కుటుంబాన్ని కొండ పైకెక్కించి, ఆలయ ప్రవేశం చేయించి సకల మర్యాదలు  చేయడంలో అర్ధం, పరమార్ధం ఏమిటి? పైగా కోర్టు కేసు క్లియర్ అయితే ఈ పధకానికి బంగారం విరాళంగా ప్రకటిస్తామని అంబానీలు ప్రకటించటం నిజంగా సిగ్గు చేటు. తన ఆలయాన్ని స్వర్ణ మయం చేయమని ఆ దేవుడేమీ కోరలేదు. ఈ అంబానీలు ఇచ్చే బంగారానికి ఏమీ ఆయన మొహం వాచి లేడు. కార్య నిర్వహణ అధికారిగా కృష్ణారావు గారు వచ్చిన దగ్గరనించి, ఆయన చేస్తున్న సంస్కరణలకు అడుగడుగునా అడ్డు తగులుతూ, స్వంత ప్రయోజనాల కోసం  ఆలయ మర్యాదలని మంట గలుపుతున్న ఆది కేశవుని కబంధ హస్తాలనుంచి టీ.టీ.డీ.  ఎప్పుడు విముక్తమవుతుందో?

Sunday, April 18, 2010

పిచ్చి ముదిరింది!

నాయకుడేమో అంతర్యుద్ధం తప్పదని ఫత్వాలు జారీ చేస్తున్నాడు. అదీ చట్ట బద్దంగా ఏర్పాటైన కమిటీని సవాల్ చేస్తూ! అనుచరులేమో మర్యాద రామన్న సినిమా షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో జై తెలంగాణా అని బలవంతంగా నినాదాలు చేయిస్తున్నారు.  ఇక ప్రత్యెక రాష్ట్రం సెంటిమెంటు అనేది ఉన్నట్టా లేదా కొంత మంది స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు రగిలిస్తున్నారా? అసలు అంతర్యుద్ధం అంటే అర్ధమేమిటో ఆ నాయకుడికి తెలుసా? తెలంగాణా ప్రాంతం వారు, ఇతరులు తమలో తాము కొట్టుకోవాలనా ఆయన ఉద్దేశ్యం? ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పై పోలీసులు సు మోటో కేసు బుక్ చేసి జైల్లోకి తొయ్యాలి.  అప్పుడు గానీ ఈ పిచ్చి ప్రేలాపనలు ఆగవు.

Saturday, April 17, 2010

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!

రానున్న ప్రజా పధం కార్యక్రమంలో తెలంగాణా కోసం రాజీనామా చేయని ప్రజా ప్రతినిధులని  నిలదీయాలని కే.సి.ఆర్. పిలుపునివ్వడం విచిత్రం. తన పార్టీకి చెందిన శాసన సభ్యులందరూ రాజీనామా చేసినా పదవిని పట్టుకు వేళ్ళాడుతున్న తానె అలా నిల దీయాల్సిన పక్షంలో మొదటి వ్యక్తిగా  నిలబడాల్సి వస్తుందని ఆయనకి తోచలేదు కాబోలు! ఫాల్తూ కమిటీ అని చెడ తిట్టిన శ్రీ కృష్ణ కమిటీ కి నివేదిక ఇవ్వడమే  గాక చర్చలు కూడా జరిపి వచ్చారు. మంచిదే.  కానీ తిరిగి వచ్చిన వెంటనే కమిటీ నివేదిక అనుకూలంగా రాక పొతే అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించడం సమస్యని మళ్ళీ మొదటికి తేవడమే!  కేవలం ఉనికిని కాపాడుకోవటానికి చేసే ఇటువంటి కాల యాపన జిమ్మిక్కు రాజకీయాలు ప్రజలు గమనించడం లేదనుకోవడం పొరబాటు.    ఇటువంటి పంధానే     కొనసాగిస్తే ఇప్పటికే హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొహం చెల్లని ఆయన పార్టీకి ఏకంగా తెలంగాణాలోనే నూకలు చెల్లే రోజు వస్తుంది.   

Monday, April 12, 2010

ఇంత హంగామా అవసరమా?

సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. సంతోషం. ఐతే ఈ విషయంలో మీడియా చాలా ఎక్కువ హంగామా చేసి అనవసరమైన ప్రచారం ఈ పెళ్ళికి  కలుగ జేసింది. ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్లు ఒక పాకిస్తానీని వరించి దుబాయిలో సెటిల్ అవుతానని ప్రకటించేసిన ఆమెను ఆశీర్వదించి వదిలేస్తే చాలు. అంతే తప్ప ఆమె కట్టుకున్న చీర ఖరీదెంత? కారు కలరెంటి? పెళ్ళిలో భోజనాల వివరాలు ఇత్యాదులన్నీ భారత ప్రజలకి అనవసరం. భారత దేశం నుండి విశిష్టమైన అర్జున అవార్డుని అందుకొని, ఎం.జీ.ఆర్. యూనివర్సిటీ నుండి డాక్టరేటు తీసుకొని, ఇంకా అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు సైతం కట్ట బెట్టిన దేశాన్ని కాదని వెళ్లి పోతున్న సానియాను పట్టుకొని పాకులాడటం మీడియా చేస్తున్న అతి గానే భావించాలి.