Sunday, August 10, 2014

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ! సంప్రదాయాలని పాటించటం లేదట!  ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోని 8వ అధికరణం ప్రకారం గవర్నరుకి విశేషాదికారాలని కట్టబెడుతూ కేంద్రం రాసిన లేఖకి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ స్పందన అది !  దయ్యాలు వేదాలు వల్లించటం అంటే సరిగ్గా ఇదే అనాలి.  ఏ సమాఖ్య స్ఫూర్తిని పాటించి, ఏ సంప్రదాయాలు పాటించి తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నారో ఒకసారి వారి అంతరాత్మలని ప్రశ్నించుకోవాలి.   సంపూర్తిగా అభివృద్ది చెందిన రాజధాని ని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రానికే రాజధాని లేకుండా తన్ని తగలేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయటమనే సంప్రదాయం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా?  ఈ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది ఇప్పుడే కదా!  అలాగే ఒక రాష్ట్ర శాసన సభ అభిప్రాయం కోసం పంపిన బిల్లుని తిరస్కరించి పంపినప్పటికీ, దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం తాను  అనుకున్న పద్ధతిలో తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేయటం ఏ విధమైన సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందో  ఎవ్వరూ చెప్పలెరు.  అప్పుడు గుర్తుకి రాని సంప్రదాయాలు, స్పూర్తులు ఇప్పుడే వారికి జ్ఞప్తికి రావటం ఆశ్చర్యం!  అయినా కూడా, విద్వేషాల పునాదుల పై ఉద్యమం నడిపి,  ప్రత్యెక రాష్ట్రం సాధించిన తరువాత కూడా - విద్వేషాలను పెంచే రీతిలోనే పరిపాలన సాగిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా?  చట్ట సభల్లో ఆమోదం పొందిన విభజన చట్టంలోని అంశాలని తిరస్కరించటం అంటే ఖచ్చితంగా
రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది.   ఓ పక్క పిల్ల నాయకులు భారత దేశంలో బలవంతంగా కలుపబడ్డామని వాపోతున్నారు!   ఇక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన విభజన చట్టానికి వ్యతిరేకంగా ధిక్కారం చూపుతుంటే కేంద్రం చర్యలు తీసుకోక తప్పదు... 

Thursday, July 31, 2014

కిష్కింద కాండ కి కారణమెవరు?

భారత దేశపు అత్యున్నత చట్ట సభల్లో ఆమోదింపబడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ళ పాటు  హైదరాబాదు పై ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాన హక్కులు వున్నా కూడా, ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం  చేస్తోంది ఎవరు? 




విద్యా, ఉద్యోగ విషయాల్లో  ఆర్టికిల్ 371 (డి) అన్ని ప్రాంతాల వారికి సమానంగా వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కూడా,  స్థానికత పేరున వివాదం సృష్టిస్తోంది ఎవరు?  









అందుకే దేశంలో వెనుకబడ్డ  ప్రాంతాలంటూ ఏవైనా వుంటే వాటికి ప్రత్యెక ప్యాకేజీ లివ్వాలే గానీ ప్రత్యెక రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పొతే - అది మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్లే అవుతుంది...

Wednesday, May 7, 2014

సీమాంధ్ర రాజకీయ నాయకులను/పార్టీలను నేను తిరస్కరించాను !

అత్యంత హేయమైన పధ్ధతిలో, అవమానకరమైన రీతిన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిన దుష్ట శక్తి కాంగ్రెస్ పార్టీ! ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో వుండి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరమ లోప భూయిష్టమైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని (అద్వానీ గారే సెలవిచ్చారు) - అనేక రాజ్యాంగ సవరణలు అవసరమైన పరిస్థితిలో కూడా వాటిని విస్మరించి కాంగ్రెస్ అకృత్యానికి వంత పాడిన చరిత్ర హీనమైన పార్టీ బీజేపీ ! మిగిలిన పార్టీల సంగతి చెప్పనక్కరలెదు. అవకాశ వాదమే తప్ప, అవమానానికి గురి అవుతున్న తెలుగు జాతికి అండగా నిలబడ్డ పార్టీ లేనే లెదు. అందుకే ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను రంగంలో నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులని తిరస్కరిస్తూ నా వోటు "నోటా" కి వెసాను. మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ఏదేని రాజకీయ పార్టీ గాని, అభ్యర్ధి కానీ నెగ్గవచ్చు గాక...నా వ్యక్తిగత హోదాలో మాత్రం అవకాశ వాద పార్టీలను, వాటి అభ్యర్ధులను తిరస్కరించి సంతృప్తి చెందాను. వోటింగ్ మెషిన్ లో నోటా బటన్ ప్రవేశ పెట్టి తిరస్కార వోటుకి అవకాశం కలిగించిన భారత ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు!

Wednesday, March 19, 2014

జీఓఎం కు వచ్చిన ఈ మెయిళ్లు 13,251 మాత్రమెనట !


రాష్ట్ర విభజనకై ఏర్పాటు చేసిన జీఒఎం కి వచ్చిన ఈ మెయిల్స్ విషయమై గతంలో నేను ఒక టపా వేయటం జరిగింది.  అలాగే ఇదే విషయమై కేంద్ర హొమ్ శాఖకి సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం వివరాలు కూడా వేరొక టపా లో  తెలియజేశాను.   విజ్ఞాపన అందిన మూడు నెలల తరువాత కేంద్ర హొమ్ శాఖ తీరికగా పంపిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నాను.      

Kindly provide the following information at the earliest : 

1.Howmany emails were received in response to the invitation of feed back on terms of reference of Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh 

Reply: 13,251 emails were received in response to the invitation of feedback by the GoM. 

2.Howmany emails supported for bifurcation of Andhra Pradesh and howmany emails opposed the bifurcation of Andhra Pradesh 

Reply: Information not maintained by the CPIO.

3.Whether the GoM has studied all the emails received in this regard 
4.Whether the response of the public vide emails is being incorported in the report of GoM

Reply: (Point Nos 3 & 4) Do not come under the purview of the RTI Act,2005.

5.It is requested to kindly provide the soft copies of the mails received or to made them accessible for public view in any website 

Reply: Right now, it is not technically feasible to make available in soft copy or through web.  However, efforts are being made to make it feasible. 

పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి,  బాధిత ప్రాంత ప్రతినిధులని వెళ్ళగొట్టి - ఉరుకులు పరుగుల మీద అడ్డగోలు రాష్ట్ర విభజన చేసిన కేంద్రానికి ప్రజాభిప్రాయాన్ని చదివే తీరిక కూడా లేదని స్పష్టమై పోయింది.   ప్రజాభిప్రాయానికి ఎలాగూ పాతరేశారు, కనీసం రాజ్యాంగ బద్ధత పాటించారా అంటే,  అదీ లేదు.  ఆర్టికిల్ 371 (D) గురించి అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ఈ రోజుకీ బ్రహ్మ పదార్దమే ! ఇదే విషయమై సమాచార హక్కు చట్టం కింద నేను విచారిస్తే నాకు లభించిన  సమాధానం ఇది !    

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 
2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report .. 

Reply :- Point Nos.1&2 : No information available with the CPIO

ప్రజానీకం పట్ల గానీ,  రాజ్యాంగ వ్యవస్థల పట్ల గానీ జవాబుదారీ తనం అన్నది ఏ కోశానా లేకుండా నిస్సిగ్గుగా జరిగిన రాష్ట్ర విభజన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం... 

Saturday, March 1, 2014

కృష్ణారావు గారి అమాయకత్వం!



రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రేతర వ్యక్తి ఉండాలంటూ ప్రస్తుత అధికారి మహంతి పదవీ కాలాన్ని పొడిగించటం తెలుగు అధికారులని అవమానించటమే అని సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మండి  పడ్డారు.  

కృష్ణారావు గారు సీనియర్ అధికారి.  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా  సమర్ధవంతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి.  అయితే సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న సీనియర్ స్థాయి అధికారులకి ప్రభుత్వ పోకడలు, సాధారణ ప్రజలకన్నా ఎక్కువగానే ఆకళింపు అవుతాయి.  అటువంటప్పుడు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తెలుగు వారికి గానీ, తెలుగు వారి అభిప్రాయాలకి గానీ  చోటే లేదన్న విషయం సామాన్య పౌరునికి కూడా అవగతమై పోయింది.  రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికే పూచిక పుల్ల విలువనివ్వని కేంద్రం, రాష్ట్ర అధికారులకి విలువనిస్తుందని ఆయన ఎలా ఆశించారో?   అంతే కాదు.. సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తమ జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి 66 రోజుల పాటు సమ్మె చేసినా చలించని కేంద్ర ప్రభుత్వం ఆయన 10 రోజుల పాటు ఆర్జిత సెలవు పై వెళితే స్పందిస్తుందా?  గత సంవత్సరం జూలై 30 వ తేదీ తరువాత నుండి తెలుగు వారికి జరిగిన అవమానాల్లో ఇది ఎన్నోది అని లెక్క వేసుకోవటమే మనకి గానీ, కృష్ణారావు గారికి కానీ మిగిలిన కర్తవ్యం! 

Friday, February 21, 2014

తెలంగాణా వచ్చింది మాయా జూదం తోనే!


ధృతరాష్ట్రుని లాగ ప్రధాని,  భీష్మ పితామహునిలాగా అద్వానీ,  కళ్ళు-చెవులు మూసుకొని ఉండగా .. 
  

రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ 3,4 అనే శక్తివంతమైన పాచికలతో శకుని పాత్ర ధరించిన కేంద్రం పార్లమెంటు సభల్లో  ఆడిన మాయాజూదం తో తెలంగాణా రాష్ట్రం వచ్చింది... . మార్గం ఏదైనా కూడా  వారనుకొన్న  గమ్యం చేరుకున్న తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు! 




ఇక సీమాంధ్ర !  మాయా జూదంలో సంక్రమించిన ఓటమి ఎప్పటికీ ఓటమి కానేరదు!  ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల శల్య సారధ్యంతో దెబ్బ తిన్న సీమాంధ్ర నూతన రాష్ట్రం  - నేలకి కొట్టిన బంతి లాగ పైకి లేవాలి!  ఏ ఇతర రాష్ట్రాల వారు కుట్రలు పన్ని తెలుగు వారిని బలహీన పరచాలని చూసారో - వారందరూ ఈర్ష్య పడేలా స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ది సాధించి తెలుగు వారి సత్తా  ఏమిటో చాటాలి!  ఈ గమ్యం చేరటానికి సీమాంధ్ర కి కూడా శుభ కామనలు!  

Thursday, February 20, 2014

విభజన ఇస్తున్న విష ఫలాలు !

పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని - ఒక లక్ష్యాలు, ఉద్దేశాలు లేని బిల్లుతో - కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలు విభజనకి కాంగ్రేస్  పార్టీ తెగబడింది. 


 ఇరు పక్షాల అంగీకారం లేకుండా, కేవలం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ సీమాంద్ర పై స్వయంగాకేంద్రమే సవతి తల్లి ప్రేమ చూపటం ఇతర రాష్ట్రాలకు కూడా అలుసై పోయింది. అందుకే అడ్డగోలు విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం ఆలస్యం.. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు తమకు ఇవ్వాలని తమిళనాడు నాయకులు డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. రేపు ఒడిసా వారు సింహాచలాన్ని, కర్నాటక వారు మంత్రాలయాన్ని కూడా అడుగుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇది బయట రాష్ట్రాల సంగతి..


ఇక మన రాష్ట్రంలోనే, ప్రస్తుత రాజధాని లోనే తెలంగాణా ప్రాంత ఉద్యోగులు దాష్టీకం మొదలు పెట్టేసారు.  విభజన జరిగే వరకు కూడా ఆగలేక పోతున్న వారు రేపు బిల్లు చట్ట బధ్ధమైతె సీమాంధ్రుల ని ప్రశాంతంగా ఉద్యోగాలు చేయనిస్తారా? కేంద్రం కందిరీగల తుట్టెని కదిపింది... ఇది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలని ఏ పతనపు అంచులకి తీసుకు పోతుందో కాలమే తేల్చాలి!     

Wednesday, February 19, 2014

కాంగ్రెస్ అంటించిన కార్చిచ్చు ఆంద్ర ప్రదేశ్ తో ఆగదు !


"మా నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణా కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ-1 ఉన్నప్పుడే  మాట ఇచ్చారు. కనుక తెలంగాణా రాష్ట్రం ఇవ్వటం మా విధి.  దానినే మేం నిర్వర్తించాం"    

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన వెంటనే లోక్ సభ బయట కేంద్ర హొమ్ మంత్రి షిండే ప్రకటన ఇది!  


ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా -  రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నా -  చివరికి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించినా కూడా, కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అమలు పరచ వచ్చో ఆంద్ర ప్రదేశ్ విషయంలో ఉదాహరణ చూపింది.  23 జిల్లాల భవితవ్యాన్ని కేవలం 23 నిమిషాల చర్చ(?) తో ఎలా నిర్దేశించ వచ్చో అన్న దానికి ఒక దారి చూపింది.  అయితే ఈ దారి ఎన్ని విపరిణామాలకి   దోవ తీస్తుంది అన్నది వెంటనే తెలిసి పోయింది.  తెలంగాణా ఏర్పాటు చేసిన విధంగానే గోర్ఖాలాండ్ ను కూడా  ఆర్టికిల్ 3 కింద వెంటనే ఏర్పాటు చేయాలని గోర్ఖా జన్ ముక్తి మోర్చా 
డిమాండ్    చేసింది.  

The Gorkha Janmukti Morcha extends heartiest congratulations to the people of Telangana as the bill for creation a separate state of Telangana has been passed in the Lok Sabha. We would now request the Centre to similarly consider the just and fair demand for separate state of Gorkhaland, which is amongst the oldest in the country.
Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
Congratulations to both the Congress and the BJP for respecting sentiments of Telengana people and supporting the bill.

 రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ వచ్చని స్పష్టం అయిన దరిమిలా దశాబ్దాలు గా ఉద్యమం వున్నగోర్ఖాలాండ్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇక్కడితో ఆగదు... రాబోయే కేంద్ర ప్రభుత్వాల్లో తమకు పరపతి ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ప్రత్యెక రాష్ట్రాలు అడిగే పరిస్థితి తప్పక వచ్చి తీరుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విభజన వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన వైనం వారికి మంచి మార్గ దర్శనమవుతుంది. చివరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఎన్ని రాజ్యాలు, సంస్థానాలు వున్నాయో అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు !

Tuesday, February 18, 2014

తెలుగు జాతి వంచింప బడింది..

కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తెలుగు జాతి ఘోరంగా వంచింప బడింది. హేతు బద్ధత అన్నది లేకుండా ప్రధాన పతిపక్షం కూడా కేంద్ర వంచనకి వంత పాట పాడి తెలుగు వారి గుండెల్లో విభజన కత్తి దించింది.   టేబుల్ ఐటెం గా కాబినెట్ నోట్ తయారైన నాటినుండి లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టె సమయం వరకు అన్ని ప్రక్రియల్లోను వంచనే!  బాధిత ప్రాంతం యొక్క వాణి ని నొక్కి పెట్టి, సభలో వారికి సరైన ప్రాతినిధ్యమే అన్నది లేకుండా చేసి - జరుగుతున్న దురంతాన్ని ప్రజానీకం తిలకించకుండా ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి, లోక్ సభ తలుపులు మూసిపెట్టి చేసిన దురాగతం భారత ప్రజాస్వామ్య చరిత్రకే మాయని  మచ్చ..  తెలుగు తల్లి రక్తాశ్రువులు కారుస్తుంటే కేంద్రంతో కుమ్మక్కు అయిన వేర్పాటు వాదులు అడ్డ తోవలో రాష్ట్రం ప్రకటింప బడ్డా కూడా అఖండ విజయం సాధించినట్లు రొమ్ములు విరుచుకుంటే సిగ్గు చేటు.  విభజన కాష్టంలో పదవుల బొగ్గులు  ఏరుకుందామనే రాజకీయ నాయకులు  -  వారు ఏ పార్టీ వారైనా సరె.. ఏ ప్రాంతం వారైనా సరే .. తప్పనిసరిగా చరిత్ర హీనులే!  తెలుగు జాతికి ఈరోజు మర్చి పోలేని దుర్దినం అనటంలో ఏ మాత్రం సందేహం లెదు... 

Sunday, February 16, 2014

సీమాంధ్ర దేశం అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?



సున్నితమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎంత అధ్వాన్నంగా యూపీఏ ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో పై ప్రకటన చూస్తె అర్ధం అవుతుంది.  గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ ద్వారానో, కమిటీల నివేదికల ద్వారానో లేదా ఆయా రాష్ట్రాల శాసన సభల తీర్మానాలతొనొ ఏర్పడ్డాయి.  అంతే తప్ప ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి వున్న అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం అన్నదే లేకుండా  జరగలేదు.   ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా అధికారం వుంది అన్నది నిజమె.  అయితే ఆ  విచక్షణాధికారాన్ని వినియోగించే ముందు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారి అంగీకారం ఉందా లేదా అన్న ఆలోచనే లేకుండా కేవలం ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ము కాస్తూ విభజన ప్రతిపాదించ బట్టే -  నేడు విభజన బిల్లు ని కూడా దొంగ చాటుగా,  ప్రతి పక్షాలకి సమాచారం కూడా లేకుండా లోక్ సభలో ప్రవేశ పెట్ట వలసిన దుస్థితి దాపురించింది.  రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి పంపిన బిల్లుని కూడా నిస్సిగ్గుగా,  పార్లమెంటు సమావేశాలు వారంలో ముగుస్తాయనగా,  3 నెలలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగా ప్రవేశ పెట్టటమే అప్రజాస్వామికం.  వోట్ ఆన్ అకౌంట్  బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు?  రెండు నెలలలో ముగిసి పోయే కాలపరిమితిలో ఉన్న  ప్రభుత్వం  కీలక నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి  స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకూడదు కనుక!  అలాగే రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం కూడా 52 నెలలు నిద్ర పోయిన కేంద్రం చివరి 8 నెలలలో తీసుకొని హడావిడిగా అమలు పరచాలని చూడటం - కేవలం రాబోయే ఎన్నికలలో ప్రయోజనం పొందుదామన్న దురుద్దేశ్యం తోనే అన్నది స్పష్టం.  ఆ నిర్ణయం అమలు పరిచే విషయంలో కూడా సీమాంద్ర ప్రాంత ప్రజల, ప్రతినిధుల, మంత్రుల విన్నపాలని పూర్తిగా పెడ చెవిన పెట్టి, స్వయానా కేంద్రమే తెలంగాణా ప్రాంత ప్రతినిధిగా అవతారమెత్తి విభజన బిల్లు తయారు చేయబట్టే నేడు ఈ ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి.   పాలక పక్షం సంగతి అలా ఉంచితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా తాము చిన్న రాష్ట్రాలకి అనుకూలమంటూ తెలంగాణ కి మద్దతు ప్రకటించటం శోచనీయం.  తాము 3 రాష్ట్రాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకొనే బీజేపీ పార్టీకి ఆ మూడు రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో తెలియదనుకోవాలా?  బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల విషయంలో ఆయా రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ సాఫీగా జరిగిందన్న సంగతి మరువకూడదు.  పైగా అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, పూర్తిగా అభివృద్ది చెందిన ఉమ్మడి రాజధానిని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే రీతిగా ఏర్పడలేదు.  ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా తెలంగాణాకి మద్దతు అంటే సీమాంధ్ర పరిస్థితి ఏమిటి?  ఈ విధంగా పాలక పక్షం - ప్రతిపక్షం ఒక్కటై పోయి సీమాంద్ర  ప్రాంత ప్రయోజనాలకి ఇసుమంతైనా విలువనివ్వకుండా ముందుకు సాగటం ఘోరం.  దొంగ చాటుగా బిల్లుని ప్రవేశ పెట్టటానికి దిగజారిన కేంద్రం,  ఆ సమయంలో నిరసనలకి వచ్చిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర ఎంపీలతో భౌతిక దాడులు చెయించటమే గాక విభజన బిల్లు లోక్ సభ ఆస్తి అని కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన సమయంలో సీమాంద్ర  సభ్యులని సభనుండి  బహిష్కరించి - బాధిత ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యమే సభలో లేకుండా చేసి - బిల్లుని ఆమోదింప జేసుకుందామని కుట్ర పన్నితె ఇక సీమాంధ్రకి గత్యంతరం ఏమిటి?  ప్రత్యెక దేశం వంటి  డిమాండ్లు రావటంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది? 
(ప్రత్యెక దేశం వాదాన్ని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు.  పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది అన్న ఆవేదనే ఇది. ) 

Friday, February 14, 2014

లగడపాటి వాదనలో నిజమెంతో తేల్చాలి!


పారదర్శకతకు పాతరేస్తూ  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని కేంద్ర హొమ్ మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన తీరు అప్రజాస్వామికం.  రోజువారీ సభా వ్యవహారాల్లో లేని అంశాన్ని ఉన్న  పళంగా సభ్యులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ బిల్లుని ప్రవేశ పెట్టె విషయంలో ప్రతిపక్షాలన్నీ అభ్యంతరం లేవనెత్తాయి.  ఈ అభ్యంతరాలన్నీ ఒక  ఎత్తు అయితే, బిల్లుని ప్రవేశ పెట్టినట్లు చెప్పబడుతున్న సమయంలో జరిగిన అరాచక సంఘటనలు మరో ఎత్తు.  ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించేలా లోక్ సభ కెమెరాలు హొమ్ మంత్రి ముందు జరిగిన దృశ్యాలని చూపక పోవటం లోనే కేంద్ర ప్రభుత్వ కుట్ర బయల్పడుతోంది.  తెలంగాణా ప్రాంత ఎంపీ లతో పాటు ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కూడా మూకుమ్మడిగా దాడి కి పాల్పడటం తో ఆత్మ రక్షణకే  పెప్పర్ స్ప్రే వాడ వలసి వచ్చిందని లగడపాటి రాజగోపాల్ వాదిస్తున్నారు.  భారత ప్రజాస్వామ్యం తల దించుకొనె విధంగా లగడపాటి ప్రవర్తించారంటూ పెడ బొబ్బలు పెడుతున్న అధికార పక్షం వారు ఆ సమయంలో లోక్ సభ చిత్రీకరణ దృశ్యాలని బహిర్గిత పరచవచ్చు కదా!  ఆ దృశ్యాలని  దాచెయటంతోనే  కేంద్ర ప్రభుత్వం లోక్ సభ కార్యాలయం పైన  కూడా వత్తిడి తెచ్చి  కుట్ర పూరితంగా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది.  అంతే కాదు,  ఆ గొడవ జరిగిన తరువాత కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 16 మంది సభ్యులని మాత్రమె లోక్ సభ నిబంధన 374 (ఎ) కింద సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించటం కూడా పక్షపాత పూరితమే అవుతుంది.  లోక్ సభ నిబంధన 374 (ఎ) ప్రకారం :

Rules of procedures and conduct of Business in Lok Sabha
Chapter XVII - General Rules of Procedure: 
Automatic Suspension of a member - 
*9 374A. (1) Notwithstanding anything contained in rules 373 and 374, in the event of grave disorder occasioned by a member coming into the well of the House or abusing the Rules of the House persistently and wilfully obstructing its business by shouting slogans or otherwise, such member shall, on being named by the Speaker, stand automatically suspended from the service of the House for five consecutive sittings or the remainder of the session, whichever is less:
Provided that the House may, at any time, on a motion being made, resolve that such suspension be terminated. 

(2) On the Speaker announcing the suspension under this rule, the member shall forthwith withdraw from the precincts of the House. 

(*9 Added by L.S. Bn.(II) dt. 5.12.2001, Para 2430) 


లోక్ సభ వెల్ లోపల జరిగిన గొడవ కేవలం ఆ 16 మంది సభ్యులు వెళ్ళటం వల్ల మాత్రమె జరిగినట్లు స్పీకర్ భావించారా? ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. పై నిబంధన ప్రకారం లోక్ సభ వెల్ లోకి వచ్చిన సభ్యులందరినీ సస్పెండ్ చేయవలసి వుంటుంది. చివరికి లగడపాటి చేత మిరియాల పొడి జల్లించుకున్న బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్ లతో సహా ఆ సమయంలో తమ తమ స్థానాల్లో కాకుండా సభ యొక్క వెల్ లోపల ఉన్న సభ్యులందరినీ సస్పెండ్ చేయాలి.  కానీ తమకి కంట్లో నలుసుల్లా మారిన 16 మందిని మాత్రమె సస్పెండ్ చేయడం చూస్తె స్పీకర్ ని కూడా ప్రభావితం చేసారేమో అన్న అనుమానం వచ్చి తీరుతుంది.  ఈ విషయంలో కేంద్రం తన సచ్చీలత ని నిరూపించుకోవాలంటే తక్షణం బిల్లు ప్రతిపాదన చేయబడినట్లు చెప్పబడుతున్న సమయంలోని సభా దృశ్యాలని ప్రజానీకానికి బహిర్గిత  పరిచి,  సభా మర్యాదలకి వ్యతిరేకంగా ప్రవర్తించిన సభ్యులందరి పై చర్యలు తీసుకోవాలి.  అంత సాహసం చెయ్యటానికి కేంద్రం ముందుకి వస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే !

తెలంగాణ పై కేంద్రం ఇక తొండి ఆడనవసరం లేదు!

లోక్ సభలో  రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో జరిగిన సంఘటనల పై లోక్ సభ స్పీకర్ స్పందన ఇది!  నిజమే! ఒక ప్రజాస్వామ్య దేశం యొక్క అత్యున్నత చట్ట సభలో జరగకూడని సంఘటనలు నిన్న లోక్ సభలో చోటు చేసుకున్నాయి.  అయితే ప్రతి వాదనకి రెండో కోణం అన్నది ఉండి  తీరుతుంది.  అసలు లోక్ సభలో విభజన బిల్లు సక్రమంగా ప్రవేశ పెట్టె విషయమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  రోజువారీ వ్యవహారాల సూచిలో లేని ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లుని ఉన్న పళంగా అనుబంధ అంశంగా చెర్చెసి, కనీసం ప్రతిపక్ష నాయకురాలికి సైతం సరైన సమాచారం ఇవ్వకుండా సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తీరు పరువు తక్కువ కాదా?  తెలంగాణా విషయంలో కేంద్రానిది మొదటి నుండీ అదే తొండి ఆట!  కాబినెట్ నోట్ మొదలుకొని బిల్లు ఆమోదం వరకు అన్నీ టేబుల్ ఐటం వ్యవహారాలే నడిచాయి.  ముందస్తు సమాచారం ఇచ్చి ప్రక్రియ కొనసాగించే ధైర్యం ఏ స్థాయిలోనూ కేంద్రం చూపలేదు.  చివరికి ఇప్పుడు లోక్ సభలో

బిల్లు ప్రవేశ పెట్టె విషయంలో కూడా స్వయానా ప్రతిపక్ష నాయకురాలు అభ్యంతరం తెలియ జేసినా కూడా దొంగాట ని కేంద్రం కొన సాగిస్తూనే ఉంది.  అసలు పదవీ కాలం ముగుస్తున్న చివరి రోజుల్లో ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల బిల్లుని ప్రవేశ పెట్టటానికే రాష్ట్రపతి అనుమతి ఇవ్వకూడదు. అందునా స్వయానా కేంద్రమే ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ ఏక పక్షంగా తయారు చేసిన బిల్లుని సాధారణ బిల్లు మాదిరిగా గుర్తించరాదు.  పైగా ఈ బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి కూడా తిరస్కరించి పంపిన సందర్భంలో ఆయా సభల అభ్యంతరాలని పరిష్కరించాకే విభజన ప్రక్రియ కొనసాగించాలి.  అయితే   దురదృష్ట వశాత్తు రాష్ట్రపతి కూడా ఈ విషయంలో
తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా కేంద్ర మంత్రి మండలినిర్ణయానికే పచ్చ జెండా ఊపారు.  బీజేపి సీనియర్ నాయకుడు అద్వానీ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో  వోట్ ఆన్ అక్కౌంట్ తప్ప మరే బిల్లులు ప్రవేశ పెట్టరాదంటూ అభిప్రాయ పడ్డారు.  ఐనా ఎవరి అభిప్రాయంతో నైనా కేంద్రానికి పనేముంది?  ఇప్పుడు బాధిత ప్రాంతమైన సీమాంద్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులందరినీ సభ నుండి బహిష్కరించిన తరువాత కేంద్రానికి  ఇక తొండి ఆడే అవసరం లేదు.  రాజ మార్గంలోనే మెజారిటీ ప్రజాభిప్రాయానికి గొంతు నొక్కే ప్రక్రియని చట్ట సభల్లోనే పూర్తి చేయ వచ్చు.    

Thursday, February 13, 2014

న్యాయ స్థానాల జోక్యం ఇంకెప్పుడు?

మన ప్రజాస్వామ్య దేశంలో  కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా  పని చేయటం అత్యావశ్యకమే. అయితే కొన్ని సందర్భాల్లో కార్యనిర్వాహక వ్యవస్థలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు జోక్యం చేసుకొని సరి దిద్ద వలసిన బాధ్యత న్యాయ వ్యవస్థకి ఉంటుంది.   అయితే దురదృష్ట వశాత్తు తొలి దశ నుండి అత్యంత అప్రజాస్వామికంగా, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ విభజన ప్రక్రియ పై దాఖలైన వ్యాజ్యాలని - పార్లమెంటు ముంగిటకి బిల్లు వచ్చిన దశలో కూడా - సరైన సమయం కాదు అని పేర్కొంటూ సుప్రీం కోర్టు తిరస్కరించటం శోచనీయం.   రాజ్యాంగంలోని ఆర్టికిల్ 3 ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఒక రాష్ట్ర విభజన ప్రతిపాదించ వచ్చు అన్నది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం విషయంలో కేంద్రం నిరూపించి చూపింది.  ఒక రాష్ట్ర విభజన ప్రక్రియలో ఆ రాష్ట్ర ప్రజానీకానికి గానీ లేదా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గానీ ప్రమేయం అన్నదే లేకుండా సర్వాధికారాలు కేంద్రం గుప్పిట్లోకి తీసుకొని నిరంకుశంగా, ఏక పక్షంగా విభజన ప్రక్రియ సాగిస్తున్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించటం తప్ప చేయ గలిగింది ఏమీ లెదు.  నవంబరు 2013 నాటికి రాష్ట్ర విభజనకి సంబంధించిన ముసాయిదా బిల్లు తయారు కాలెదు.  అప్పటికి దాఖలైన వ్యాజ్యాలని అపరిపక్వ దశ అని పేర్కొంటూ కొట్టి వేయటంలో అర్ధం ఉంది.  కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనల తో కూడిన -   కారణాలు, లక్ష్యాలు అన్నవి చూపకుండా, ఆర్ధిక పత్రాలు జత చేయకుండా చిత్తు కాగితాల వంటి బిల్లు రాష్ట్ర శాసన సభ మొఖాన కొట్టి కేంద్రం అభిప్రాయం చెప్పమనటం ఏ విధంగా ప్రజాస్వామికం అవుతుంది?  కేంద్రం వల్లె వేస్తున్న ఆర్టికిల్ 3 లోనే పార్లమెంటులో పెట్టబోయే బిల్లునే రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలని ఉన్నప్పుడు చిత్తు ప్రతిని పంపటం రాజ్యాంగ  ఉల్లంఘన కాదా?  బిల్లు పై రాష్ట్ర శాసన సభ అందజేసిన 9000 పైగా సవరణల గురించి ఏ మాత్రం పట్టించుకోక పోవటమె గాక -  రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించి పంపిన బిల్లుని ఏ  ప్రాతిపదిక మీద పార్లమెంటుకి సమర్పిస్తారు అన్నది స్పష్టం చేయకుండా మొండి గా ముందుకి వెళ్ళటం అప్రజాస్వామికం. ఈ
బిల్లులో అనేక లోపాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు తెలియ జేస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాను  పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నది స్పష్టం.  ఈ దశలో కూడా పార్లమెంటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం చేతులెత్తేస్తే బాధిత రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దిక్కేమిటి?  ఒక వేళ కేంద్రంలో అధికార, ప్రతి పక్షాలు చేతులు కలిపి, బిల్లుని చట్టంగా మార్చినప్పుడు న్యాయస్థానం ఆ చర్యని వెనుకకి తీసుకు రాగలదా?  ఇది అపరిపక్వ దశ అని న్యాయస్థానం నిర్ణయించినప్పుడు,  సరైన సమయం ఏది అన్నది కూడా తీర్పులో వెలువరిస్తే బాగుండేది.

పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు !

రాష్ట్ర విభజన విషయంలో మొదటి ప్రక్రియ నుండి తొండి  ఆడుతున్న కేంద్రం చివరికి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టె విషయంలో కూడా అదే ఆట కొన సాగిస్తోంది.   పార్లమెంటులో బిల్లుని గెలిపించుకుంటామన్న నమ్మకం లేక, కనీసం బిల్లుని సజీవంగానైనా  వుంచుదామనె కుట్ర పూరిత ఊహతో దొడ్డి దారిన రాజ్య సభలో ప్రవేశ పెడదామని ప్రయత్నించి భంగ పడింది.  ఇప్పుడు లోక్ సభ వంతు.  తమ ప్రాంత ప్రయోజనాలకి పూర్తి విరుద్ధంగా ఉన్న బిల్లుపై నిరసనలు తెలుపుతున్న సీమాంద్ర సభ్యులని నిలువరించే  కుట్రలో భాగంగా తెలంగాణా ప్రాంత ఎంపీ లతో పాటుగా ఇతర రాష్ట్రాల ఎంపీ లని కూడా  హొమ్ మంత్రి ముందు మొహరింప చేయటమే కాకుండా నిరసన తెలుపటానికి ముందుకి వచ్చిన సీమాంద్ర సభ్యుల పై భౌతిక దాడులకి కూడా తెగ బడే స్థాయికి దిగ జారింది.  మూకుమ్మడిగా ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర సభ్యులు నానా రకాలుగా దూషిస్తూ, దాడి చేస్తుంటే
ఆత్మ రక్షణ కోసం తన దగ్గర అందు బాటులో ఉన్న  పెప్పర్ స్ప్రే  ఉపయోగించ వలసి వచ్చిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజ గోపాల్ తెలియ జేశారు.  ఈ సంఘటన తరువాత ఇతర సభ్యులని లగడపాటి హత్య చెయబొయారని నానా రగడ చేస్తున్న తెలంగాణా సభ్యులు, లోక్ సభ టీవీ దృశ్యాలని బయట పెట్టమని ఎందుకు అడగరు?  ఆ దృశ్యాలు బయట పెడితే దాడికి పాల్పడింది ఎవరో, ఆత్మ రక్షణ చేసుకున్నది ఎవరో తెలిసి పోతుంది కదా! అసలు ఈ రోజు లోక్ సభ వ్యవహారాల చిట్టాలో లేని తెలంగాణా బిల్లు అంశం అనుబంధ అంశం గా హడావిడిగా ప్రవేశ పెట్టాలని చూడటమే కాంగ్రెస్ చేసిన కుట్ర.  ఓ పక్క ప్రతి పక్ష నాయకులైన సుష్మా స్వరాజ్, జగన్ వంటి వారు బిల్లు ప్రవేశ పెట్టబడ లేదని తేల్చి చెపుతుంటే, ఇక ఆ బిల్లు పార్లమెంటు ఆస్తి అని షిండే బుకాయించటం వంచనకి పరాకాష్ట.  
  

Wednesday, February 12, 2014

అద్వానీ కాలర్ పట్టుకొని అడగరేమి?

 తెలంగాణాకి వ్యతిరేకంగా లేదా సమైక్యానికి మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వారిపై బూతులు లంకించుకోవటం, భౌతిక దాడులకి దిగటం తెలబాన్లకి వెన్నతో పెట్టిన విద్య. 


శాసన సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం తగదని చెప్పినందుకు లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ పై శాసన సభ ఆవరణలోనే దాడి చేసిన విషయం తెలిసిందే. 


హైదరాబాదు ఉద్యోగుల సభకి వచ్చిన వారిని తంతాం అంటూ టీవీ కెమెరాల సాక్షిగా హెచ్చరించారు విద్యార్ధి నాయకుడు పిడమర్తి రవి! 



హైదరాబాదు ని యూటీ చేయాలి అంటే కేంద్ర మంత్రి చిరంజీవి నాలుక కోస్తామని   హరీష్ రావు హెచ్చరించారు.  



ఇక పొన్నం ప్రభాకర్  ఐతే మరీ ప్రత్యేకం!  కరీం నగర్ వస్తే ముఖ్య మంత్రి హెలికాప్టర్ ని గాల్లోనే పేల్చేస్తామని 
రంకెలెశారు!    




తాజాగా, సీమాంద్రకి  కూడా సమ న్యాయం చెయ్యాలని చెప్పినందుకు మళ్ళీ  జయప్రకాశ్ నారాయణ పై తెలంగాణా న్యాయ వాదులు  సాక్షాత్తు దేశ  రాజధానిలో కాలర్ పట్టుకొని దాడి చేసారు.    


మరి నిన్ననే భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడుతూ తప్పుల తడకలుగా ఉన్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేశారు.    

మరి ఇంత వరకు ఎవరూ కూడా  హస్తిన వెళ్లి అద్వానీ కాలర్ పట్టుకొని తెలంగాణాకి మద్దతు అడగక పోవటం ఆశ్చర్యం కలిగించే విషయమే! 

Thursday, February 6, 2014

ప్రణబ్ దాదా మరో ఫక్రుద్దీన్ కారాదు!

తన ఎన్నిక చెల్లబోదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటంతో 1975 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ  ప్రతిపాదించిన ఆత్యయిక పరిస్థితి కి సంబంధించిన ఆర్డినెన్స్ పై అర్ధ రాత్రి సంతకం చేసి రబ్బరు స్టాంపు అన్న అప్రతిష్ట మూట కట్టుకున్నారు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఈ రోజు పరిస్థితి అప్రకటిత  ఆత్యయిక    పరిస్థితి వలె ఉన్నదనటంలో ఏ మాత్రం సందేహం లెదు.  కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకై వ్యవహరిస్తున్న తీరు ఇందుకు ఉదాహరణ.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని మంత్రివర్గ సమావేశ ఎజెండాలో చేర్చకుండా కేవలం టేబుల్ పాయింటుగా  ప్రవేశ పెట్టి హడావిడిగా కాబినెట్ నోట్ ని ఆమోదించటం తో మొదలైన తొండి ఆట ఈ రోజు మంత్రుల కూటమి రాష్ట్ర విభజన బిల్లుకి  తుది మెరుగులు దిద్దే వరకు కొనసాగింది.  గతంలో రాష్ట్రపతి పాలన విధించే సందర్భాల్లో ఆర్టికిల్ 356 దుర్వినియోగం జరిపిన రీతిలో ఈనాడు రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 దుర్వినియోగం జరుగుతోంది.  విభజన ప్రతిపాదించిన రాష్ట్రం యొక్క శాసన సభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా - చివరికి ప్రతిపాదిత బిల్లుని రాష్ట్ర శాసన సభ తిరస్కరించినా కూడా కేంద్రం మొండిగా ముందుకి సాగటం ఖచ్చితంగా విచక్షణాధికారాల దుర్వినియోగమే అవుతుంది.  ఓ పక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తమ రాష్ట్ర విభజన కోసం రెండేళ్ళ క్రితమే తీర్మానం పంపితే - దాన్ని పక్కన పడేసి - ఏ ప్రతిపాదన, ప్రాతిపదిక అన్నది లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి కేంద్రం పూనుకోవటం లో ఔచిత్యం ఏమిటి అన్నది రాష్ట్రపతి పరిశీలించాలి. అంతే గాక రాష్ట్ర విభజనకై ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తున్న కేంద్రం అదే ఆర్టికిల్ 3 లో వున్న సూచనల  ప్రకారం పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే బిల్లునె రాష్ట్రపతి ద్వారా శాసన సభ అభిప్రాయానికి పంపాలి.  అయితే బిల్లు యొక్క లక్ష్యాలు, ఆర్ధిక పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలేమీ లేకుండా చిత్తు ప్రతిని రాష్ట్రం మొఖాన పడేసి అభిప్రాయం చెప్పమనటం రాజ్యాంగ  విరుద్ధమే. సీనియర్ పార్లమెంటేరియన్ గా అనేక సంవత్సరాల అనుభవం వున్న ప్రస్తుత
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు విషయంలో క్రియా శీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా వుంది.  అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనల తో ఉన్న విభజన బిల్లుని పార్లమెంటు కి పంపే ముందు సుప్రీం కోర్టు వద్ద న్యాయ సలహా పొందటం మేలు.  కాని పక్షంలో భారత దేశంలో ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయలో నెయ్యి అన్న చందాన వుందని ఋజువు అయి పోతుంది.  

సమాఖ్య స్పూర్తి ఎక్కడ?


సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందంటూ మత హింస నిరోధక బిల్లుని అడ్డుకోవటంలో విపక్షాలు విజయం సాధించాయి.  ఈ బిల్లు పై జరిగిన చర్చ సందర్భంగా అధికార, విపక్షాలకి చెందిన, ప్రముఖ న్యాయవాదులు కూడా అయిన అరుణ్ జైట్లీ, కపిల్ సిబాల్ ల వ్యాఖ్యలు గమనించతగ్గవి.   ఈ బిల్లు ఆమోదించటం తరువాత, ముందు అసలు బిల్లుని ప్రవేశ పెట్టి చర్చించే అధికారం కూడా పార్లమెంటుకు లేదని అన్ని పార్టీలు ఆక్షేపించాయి. అంతే కాదు,  ఈ బిల్లు పూర్తిగా పార్లమెంటు చట్ట పరిధి వెలుపలి అంశమని, ప్రభుత్వ పాలనా పరిధిలోకి రాదనీ అరుణ్ జైట్లీ  కుండ బద్దలు కొట్టారు.  అయితే, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే  శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబాల్ మభ్యపెట్టాలని చూసినా కూడా సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీస్తుందంటూ విపక్షాలన్నీ నిర్ద్వందంగా తిరస్కరించాయి.  తప్పని సరి పరిస్థితుల్లో బిల్లు పక్కన బెట్టినట్లు రాజ్య సభ అధ్యక్షుడు ప్రకటించారు.  

మరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సంగతి ఏమిటి?

అడుగడుగునా సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల అధికారాలని పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవాలన్న దురుద్దేశ్యం తో తయారైన తెలంగాణా బిల్లుకి చట్ట బధ్ధతె ఉండదు.  2009 డిసెంబరు 9 ప్రకటనలో రాష్ట్ర విభజనకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో తీర్మానం ద్వారా ప్రక్రియ ప్రారంభిస్తామని స్వయంగా కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.  కానీ జరిగింది ఏమిటి?  2013 జూలై 30 తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకటి వున్నది అన్న స్పృహ అనేదే లేకుండా ఏకపక్షంగా, పూర్తి  నిరంకుశ ధోరణి లో తయారు అయిన తెలంగాణా బిల్లు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? ఇంక శాంతి భద్రతలు మొదలుకొని వివాదాల పరిష్కారం వరకు ఈ బిల్లులో ఉన్న అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని కేంద్రం చేతిలోకి తీసుకొనే విధంగా వున్నవే! అసలు ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగంలో ఎందుకు ఉంది?  దేశంలో ఏదైనా రాష్ట్రం విడి పోదలుచుకున్నా  లేదా కొన్ని ప్రాంతాలు విలీనం అవుదామనుకున్నా వాటంతట అవి చేయలేవు కాబట్టి ఆయా రాష్ట్రాల శాసన సభల్లో విస్తృత చర్చల అనంతరం తీర్మానం చేసి కేంద్రానికి పంపితే - అప్పుడు కేంద్రం తనకి ఆర్టికిల్ 3 కింద ఉన్న అధికారంతో ఆయా రాష్ట్రాల అభీష్టాన్ని నెరవేర్చటం సమాఖ్య స్పూర్తి!  ఆర్టికిల్ 3 కింద తయారు అయిన బిల్లు తమ శాసన సభల యొక్క తీర్మానానికి అనుకూలంగా వున్నదా లేదా అని సరి చూసుకోవటానికే   విభజన/విలీనం జరిపే ముందు ఆయా శాసన సభల అభిప్రాయాలకి పంపాలని ఆర్టికిల్ 3 నిర్దేశిస్తోంది.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఈ విధంగానే తమ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించాలంటూ తీర్మానం చేసి పంపింది.  శాసన సభ తీర్మానం జరిగిన ఉత్తర ప్రదేశ్ ని పక్కన పెట్టి ఎటువంటి తీర్మానం పంపని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్న  పళంగా తన చిత్తం వచ్చినట్లు ముక్కలు చేయాలని  తల పోయటం కేంద్ర దురహంకారం! పైగా రాష్ట్ర శాసన సభకి పంపిన బిల్లు లో ఉద్దేశ్యాలు, ఆర్ధిక పత్రాలు వంటి ముఖ్యమైన వివరాలేమీ లేకుండా చిత్తు  కాగితాల వంటి బిల్లు పంపటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంతే గాక  విభజనకై  పంపిన బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ తిరస్కరించినా కూడా కేంద్రం విభజనకి మొండిగా అడుగులు వేయటం ప్రజాస్వామ్య విరుద్ధం. విభజనకి మొగ్గు చూపిన ఉత్తర ప్రదేశ్ విన్నపాన్ని తుంగలో తొక్కి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రే వ్యతిరేకిస్తున్న అడ్డగోలు విభజన బిల్లు పార్లమెంటుకి పంపే ముందు రాష్ట్రపతి విజ్ఞత పాటించాలి.  మత హింస నిరోధక బిల్లు కన్నా ఇంకా ఎక్కువగా పార్లమెంటు చట్ట పరిధిలో లేని అంశాలతో కూడిన, రాష్ట్ర ప్రభుత్వాలని డమ్మీలు గా మారుస్తూ కేంద్ర పెత్తనాన్ని రుద్దటానికి నిర్దేశించిన తెలంగాణా బిల్లు ని రాష్ట్రపతి తిరస్కరించాలి.     

Wednesday, January 29, 2014

నకిలీ బిల్లు పంపితే నకిలీ రాష్ట్రమే ఇవ్వాలి!

(పక్కన ఉన్న చిత్రం ఆగష్టు,2012 నాటిది)
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను గతంలో ఒక టపా  వేయటం జరిగింది.  అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న అదే కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకంటే తలుపులు మూసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని తెలిసిందే ! అసలు తెలంగాణా తేనె తుట్టెని కదిపిన 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హొమ్ మంత్రి ప్రకటనలో ఏం ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి ప్రక్రియని ఆంద్ర ప్రదేశ్ శాసన సభ తీర్మానం ద్వారా  ప్రారంభింప చేస్తామని  సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి ఆనాడు ప్రకటించారు.  అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అన్నది రాష్ట్రం లోనే ప్రారంభం కావాలన్న విషయం కేంద్రానికి తెలుసు.   కానీ ఇప్పుడెం జరిగింది? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉందన్న స్పృహే లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా సర్వాధికారాలు కేంద్రం చేతులోకి తీసుకొని - రాజ్యాంగం లోని  ఆర్టికిల్ 3 లో రాసి వుంది కదా అన్న అహంకారంతో కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటానికి పూనుకుంది. లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు (?) ని రాష్ట్ర శాసన సభ మొహాన కొట్టి అభిప్రాయం చెప్పమంది.  అదే ఆర్టికిల్ 3 లో రాసి వుంది కాబట్టి రాష్ట్రానికి పంపారు కానీ లేని పక్షంలో ఈ పాటికి కేంద్రమే రాష్ట్ర ప్రమేయం లేకుండా అడ్డగోలు విభజన పూర్తి చేసి పారేసి ఉండేది! అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్నది స్పష్టత లేకుండా ఏదో ఒకటి రాష్ట్రానికి పంపేసి అభిప్రాయం చెప్పమంటే ఎలా కుదురుతుంది?  ఈ విషయాన్నే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రశ్నకి స్పందించాల్సిన కేంద్ర హొమ్  శాఖ ఏమీ మాట్లాడక పోయినా కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ మాత్రం బుజాలు తడుముకున్నారు.  ముఖ్య మంత్రి నోటీసు పై అసహనం వెళ్లగక్కారు!  అసలీ జై రామ్ రమేష్ ఎవరు?  ఆయన స్వంత రాష్ట్రమైన కర్ణాటకలో ఠికానా లేకపోతె పాముకి పాలు పోసినట్లు రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభకి పంపితే నేడు కేంద్ర మంత్రి హోదా వెలగబెడుతున్నారు.  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తనను ఎన్నుకున్న రాష్ట్రాన్నే ముక్కలు చేయటానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంత్రుల కూటమిలో ఉండి  తప్పుల తడకల బిల్లు తయారీలో ఆయనదే ముఖ్యమైన పాత్ర!  అందుకే ముఖ్యమంత్రి నోటీసు పై కేంద్ర హొమ్ శాఖ కి బదులుగా ఆయనే  బదులిస్తున్నారు.  నకిలీ నోట్ల లాగా నకిలీ బిల్లులు వుండవు అంటూ జైరామ్ రమేష్  చేసిన ప్రకటన వ్యక్తిగత హోదాలో చేసారా లేదా కేంద్రం తరపున చేసారా అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకి కూడా సమాధానం లేదు! పైగా ప్రతి వారు రాజ్యాంగ నిపుణులు అవుతున్నారని దుగ్దని వెలిబుచ్చుతున్నారు.  రాష్ట్రపతి పంపిన బిల్లు అంటూ రోజుకి వంద సార్లు నొక్కి వక్కాణించే వేర్పాటు వాదులు కూడా గమనించాల్సిన విషయం ఒకటే!  అన్ని వివరాలతో కూడిన - పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే  సమగ్రమైన బిల్లునె రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలి తప్ప లక్ష్య నిర్వచనం లేకుండా,  శాసనాధికారాల బదలాయింపు వివరాలు లేకుండా, ద్రవ్య వ్యవహారాల మోమోరాండం లేకుండా  కొన్ని చిత్తు కాగితాలు పంపి దానినే బిల్లు అనుకోమంటే  ఎలా కుదురుతుంది?  ఆ చిత్తు కాగితాలని చించి వేసిన, తగల పెట్టిన కొంత మంది శాసన సభ్యుల చర్య సరైనదే!    

Sunday, January 26, 2014

కేంద్ర హొమ్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఆర్టికిల్ 371 (D) విషయమై అటార్నీ జనరల్ సలహాని కేంద్రం కోరిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ప్రజానీకానికి  వెల్లడించకుండా కేంద్రం హడావిడిగా బిల్లు తయారు చేసేసి రాష్ట్ర శాసన సభకి పంపేసింది.  ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర హొమ్ శాఖని 2013 డిసెంబర్ 7 వ తేదిన నేను అడిగిన ప్రశ్నలు  ఇవి:   

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 

2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report ..

49 రోజుల తరువాత నిన్ననే అందిన, కేంద్ర హొమ్ శాఖ తాపీగా ఇచ్చిన సమాధానం ఇది ! 

I am directed to refer to your RTI appiication No....dated 07.12.2013 (received by the undersigned on 10.12.2013) . 

Point no. 1 & 2 : No information is available with the CPIO. 

If you are not satisfied with the reply, you may make an appeal to the First Appellate Authority viz., Shri S. Suresh Kumar, J.S.(CS), Ministry of Home Affairs, NDCC II Bldg., Jaisingh Road, New Delhi. 


అయితే నిన్ననే శాసన సభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తూ ఇదే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితె - అది privileged information, ఇవ్వటం కుదరదు అని కేంద్రం బదులిచ్చినట్లు సభా ముఖంగా తెలియజెసారు. అంటే ఏదో ఒక విధమైన సమాచారం వారి వద్ద ఉన్నట్లే కదా ! ఒక సామాన్య పౌరుడిగా నేను అడిగితె ఏ విధమైన సమాచారం లేదని బదులిచ్చిన కేంద్ర హొమ్ శాఖ ముఖ్య మంత్రికి వేరే విధంగా సమాధానం చెప్తోందని తేట తెల్లమై పోతోంది. అసలు రాష్ట్ర విభజనకి ఎటువంటి ప్రాతిపదిక లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో విభజనకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలకి తెలియజెప్పి కేంద్రం ముందుకి సాగాలి. రాష్ట్ర విభజన విషయమై వున్న ఒక న్యాయపరమైన చిక్కుముడి విషయంలో ముఖ్యమంత్రికే సమాచారం ఇవ్వటానికి నిరాకరించటం రాష్ట్రాల అధికారాలని కేంద్రం కబ్జా చేయటమే అవుతుంది. అలాగే సామాన్య పౌరులకి సమాచారాన్ని తెలుసుకొనే హక్కుని నిరాకరించటమే అవుతుంది. 

(ఈ విషయంలో కేంద్ర హొమ్ శాఖ నుండి సమాధానం రాకముందే 30 రోజుల మొదటి గడువు ముగిసాక మొదటి అప్పీలు వేయటం జరిగింది. అప్పీలుకి సమాధానం వచ్చాక బ్లాగులో పొందుపరుస్తాను.)

Wednesday, January 22, 2014

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!


"1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో - విశాఖ పట్నంలో రెండు లారీలు ఎదురెదురుగా రాగలిగిన రోడ్లు లెవు..కర్నూలులో సౌకర్యాలు లెవు.. కాకినాడలో భవనాలు లెవు..విజయవాడ, రాజమండ్రి కూడా అంతే!  అందుకే రాజధానిగా హైదరాబాదుని నిర్ణయించారు."  

శాసన సభలో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లు పై చర్చ సందర్భంగా పిల్ల వేర్పాటువాద నాయకుడు వాక్రుచ్చిన పలుకులివి! 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాదు సంస్థానాన్ని భారత్ లో  విలీనానికి నిరాకరించి, మన దేశానికి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితికి వెళ్ళిన ఘన చరిత్ర గలవారు నిజాములు! అటువంటి నిజాములని కేవలం  కొన్ని భవనాలని నిర్మించినందుకే  అభివృద్ది చేశారంటూ  వేర్పాటు వాదులు కీర్తిస్తున్నారు. ఆ భవనాల కోసమే ఆంధ్ర ప్రదేశ్ ని ఏర్పాటు చేసారంటూ చరిత్ర ని వక్రీకరిస్తున్నారు.   అలాగయితే ప్రస్తుతం భారత దేశం పరిపాలన సాగిస్తున్న పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వంటి ఎన్నో భవనాలు బ్రిటిష్ వాడు కట్టి ఇచ్చాడు.  అందుకని వారిని కీర్తించి వారిని నెత్తిన పెట్టుకుంటామా ?    మొదటి ఎస్ఆర్సి సూచనల మేరకు ఒక భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగు వారి కోసం  ఆంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడింది.  అంతే తప్ప నిజాము అభివృద్ది చేసిన హైదరాబాదు కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు.  ఇది చరిత్ర !  ఆ తరువాత ఏం జరిగింది ?  రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజలు తమ రాజధాని అన్న అభిమానంతో 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా హైదరాబాదు నగరాన్ని అభివృద్ది చేసిన విషయం అక్షర సత్యం.   పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం.    అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని!  అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువకాలం సీమాంధ్రులే ముఖ్య మంత్రులుగా ఉన్నా, వారి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి అయినా,  రాజధాని అభివృద్ది మాత్రం  ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది.  రాష్ట్రంనుండి అయ్యే సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదించటం దీనికి తార్కాణం.  ఇంత వరకు కూడా చరిత్రే!  కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?  భారత దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో-  అభివృద్ది చెందిన రాజధానిని కబ్జా చేస్తూ రాష్ట్రంగా విడిపోవటానికి ఉద్యమాలు చేస్తే -  ఆ  వేర్పాటు వాదులతో కుమ్మక్కు అయి, ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజనకి హడావిడిగా పరుగులు పెట్టటం జరుగుతోంది.   హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, కనీసం అవశిష్ట రాష్ట్రానికి  రాజధాని ఎక్కడ అన్నది కూడా నిర్ణయించకుండా - సీమాంధ్ర ప్రయోజనాలని పూర్తిగా విస్మరిస్తూ కేంద్రం వ్యవహరిస్తోంది.  కెవలం  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన  ఉమ్మడిగా అభివృద్ది చెందిన  హైదరాబాదుని తెలంగాణాకి కట్టబెడతామంటే సీమాంధ్ర సహించదు.  హైదరాబాద్ సిర్ఫ్ హమారా!  హైదరాబాద్ మీది, మాది, మనందరిది.. మన తెలుగు వారందరిది..  

Wednesday, January 1, 2014

ఎందుకంత కాకి గోల ?

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో ఉన్న అనేక సంస్థానాలని భారత యూనియన్ లో కలిపే క్రమంలో,  మన దేశంలో కలవటానికి మొరాయిస్తున్న సంస్థానాలని దారికి తేవటానికి రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 అన్నది ప్రవేశ పెట్టబడింది.   బలమైన ఆ అధికరణ ఆనాడు ఉండబట్టే సంస్థానాల విలీనం అన్న ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 ఎందుకు చేర్చారో, ఆ అధికరణ ఏ పరిస్థితిలో చేర్చవలసి వచ్చిందో అన్న చారిత్రిక ప్రాతిపదిక తో నిమిత్తం లేకుండా,  రాజ్యాంగంలో రాసి వుంది కదా అన్న ధీమాతో -  రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం ప్రక్రియని మొదలు పెట్టాలి. అంతే కాదు,  అటువంటి ప్రక్రియ మొదలు పెట్టే ముందు  ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలన్నీ ఆ పద్ధతిలోనే  ఏర్పడ్డాయి.  అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  విచిత్రం ఏమిటంటే విభజన వాదులకి ఈ తతంగం అంతా అప్రజాస్వామికం అని అస్సలు అనిపించదు. కానీ తన మంత్రివర్గంలోని మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించె అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా కూడా, శ్రీధర్ బాబు శాఖను మార్చటం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేసినట్లు తెలంగాణా నాయకులు నానా యాగీ చేయటం  అర్ధ రహితం. ముఖ్య మంత్రి అధిష్టానాన్ని దిక్కరించటం అన్నది  వేర్పాటు వాదుల దృష్టిలో ఎంత పెద్ద నేరమో - ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా శ్రీధర్ బాబు వ్యవహరించటం కూడా అంతే  పెద్ద నేరం! ముఖ్య మంత్రి గారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు!