Thursday, October 17, 2013

శభాష్ ఎన్జీఓస్ !

విరమణ కాదు విరామమే అంటూ సమ్మెకి స్వస్తి పలికారు ఏపీ ఎన్జీఓ లు ! తండ్రిలా చూడాల్సిన కేంద్రం ధృతరాష్ట్రుడు  కౌరవ పక్షపాతం వహించినట్లు సీమాంధ్ర నెత్తిన విభజన కత్తి పెట్టినప్పుడు -  తమ ప్రాంతపు ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తినే పరిస్థితి వచ్చినప్పుడు -  సీమాంద్ర రాజకీయ నాయకులు ఏమి చేసారు ?  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తమని అధికారానికి పంపిన ప్రజలనే వంచించి పదవీ లాలసతో అధిష్టానానికి వంత పాడారు. తమని ఎన్నుకొన్న ప్రజల కన్నా కొత్తగా రాష్ట్రం వస్తే వచ్చే పదవులు, కాంట్రాక్టులే మిన్న అని భావిస్తూ ప్రజల అభీష్టానికి తూట్లు పొడుస్తూ నమ్మక ద్రోహం చేసిన రాజకీయ నాయకులు సీమాంధ్రకి రిక్త హస్తం అందించిన పరిస్థితుల్లో ఉవ్వెత్తున ఎగసి పడింది సమైక్యాంధ్ర ఉద్యమం.. ఆ ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచి ముందుకు సాగించింది ఎన్జీఓ లే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. ఆర్టికిల్ 371 (డి) ద్వారా కాపాడబడుచున్న ఉద్యోగుల ప్రయోజనాలకి విభజన ద్వారా విఘాతం కలుగుతుంటే కడుపు మండిన ఉద్యోగులు సమ్మెకి దిగారు...కానీ ఆరు నెలల్లో ముగిసి పోయే పదవిని, అధికార లాంచనాలని వదులుకోవటానికి రాజకీయ నాయకులు మాత్రం  సిద్ధ పడలేదు. వంచనకి గురి అయిన సీమాంధ్ర కి రాజకీయ పరంగా ఎటువంటి తోడ్పాటు అందని పరిస్థితుల్లో ఉద్యమ బాధ్యతని నెత్తిన వేసుకొని  రెండు నెలల పాటు తమ తమ కుటుంబాలని గాలికి వదలి, ఆర్ధికంగా కూడా నానా బాధలు పడుతూ,  అత్యంత నిబద్ధత తో రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సాగించిన సమరం సాటి లేనిది..   అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 7 వ తేదీన హైదరాబాదు లో వారు శాంతియుతంగా నిర్వహించిన సమైక్య సభ దేశ వ్యాప్త మన్ననలని  అందుకుంది.  వేర్పాటు వాదులు రక్తమోడేలా దాడులు చేసినా సంయమనం కోల్పోకుండా రాజధానిలో సమైక్య వాణి వినిపించే దమ్ము చూపారు.  సీమాంధ్రకి అన్యాయం జరుగుతోంది. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే బాధ్యత కేవలం ఎన్జీఓ లే మోయటమన్నది సమంజసం కానే కాదు.. సమాజం లోని అన్ని వర్గాలు ముందుకి వచ్చి రాష్ట్ర సమైక్యాన్ని కాపాడుకోవలసిన అగత్యం ఇప్పుడు వుంది.  కేవలం కాబినెట్ నోట్ అయినంత మాత్రాన రాష్ట్రం విడిపోయినట్లు కానే కాదు.  ఇంకా జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ చాలా చాలా వుంది. రాష్ట్రం విడి పోయినట్లే అంటూ రాజకీయ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ ఉచ్చులో ప్రజలు   పడరాదు. అవసరమైతే మెరుపు సమ్మెకి దిగటానికి ఉద్యోగులు ఎలాగూ సిద్ధంగా వున్నారు. అంతిమ ఫలితం ఎలా వున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు చూపిన మార్గ దర్శనానికి సీమాంధ్ర వారికి ఎప్పటికీ ఋణ పడి వుంటుంది.. వుద్యోగులారా అందుకోండి తెలుగు జాతి తరపున  శుభాభినందనలు..విజయోస్తు..

4 comments:

  1. Yes really excellent their and your report

    ReplyDelete
  2. anta seenu ledule saaruu

    ReplyDelete
  3. ఏదారెటుపోతుందో ఎవరికి ఎరుక?

    ReplyDelete
  4. All is NOT Lost. Kudos to Ashok Babu & his Team. What some of the spineless people like us cd not, they did it and showed us the right path. The only hope lies in their movement. One can no longer place trust in any of their elected leaders. I heartily wish all success to Ashok Babu.

    ReplyDelete