Tuesday, September 10, 2013

శ్రీ కృష్ణ కమిటీ నివేదికే కర దీపిక కావాలి !


జస్టిస్ బీ ఎన్ శ్రీకృష్ణ ! 

నిబధ్ధతకి,  నిర్భయత్వానికి,  నిష్పాక్షికతకి మారు పేరు !



1992 లో బొంబాయి అల్లర్ల పై కేంద్రం విచారణ కమిషన్ వేయాలని నిర్ణయించినపుడు సీనియర్ న్యాయమూర్తు లెందరో ఆ బాధ్యత స్వీకరించటానికి నిరాకరిస్తే ధైర్యంగా ముందుకి వచ్చి నిష్పాక్షికంగా విచారణ పూర్తి చేసిన కార్య శీలి! 
   
సాఫ్ట్ వేర్ రంగం  హవా కొనసాగుతున్న సమయంలో - ఐటీ రంగ ఉద్యోగాలు తప్ప తక్కినవన్నీ దండగ అని భావింప బడుతున్న రోజుల్లో 6 వ పే కమిషన్ అధ్యక్షుడుగా బాధ్యత స్వీకరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ప్రదమైన జీత భత్యాలు ప్రకటించిన యదార్ధ వాది  ఆయన ! 

ఇటువంటి ఘన చరిత్ర కలిగిన జస్టిస్ శ్రీకృష్ణ గారికి  2010 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా సమస్య మూలాలు కనుగొని తగిన పరిష్కారాలు సూచించే బాధ్యతని అప్ప చెప్పింది.  వివిధ రంగాలకి చెందిన మరో నలుగురు మేధావుల తో కలిపి ఒక కమిటీ ని ఏర్పాటు  చేసింది. ఈ కమిటీ 8 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి,  రాష్ట్రంలోని అన్ని వర్గాలకి చెందిన  ప్రజల నుండి, అన్ని రాజకీయ పార్టీలనుంచి అభిప్రాయాలు, విజ్ఞాపనలు స్వీకరించింది. అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి , విశ్లేషించి ఒక సమగ్రమైన నివేదికని కేంద్ర హొమ్ శాఖకి సమర్పించింది.    


కమిటీ తన నివేదికలో తెలంగాణా సమస్యని మూలంనుంచి చర్చించటమే గాక ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా 6 అమలు చేయదగ్గ పరిష్కారాలు సూచించింది. అంతే  కాదు.. దగా, దోపిడీ, వెనుకబాటు తనం అంటూ తెలంగాణా వుద్యమకారులు చెప్పుకొస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే అని సంఖ్యా వివరాలతో సహా కుండ బద్దలు కొట్టింది.  తెలబాన్లు చేస్తున్న అబద్ధపు గోబెల్స్ ప్రచారాలని ఏనాడూ సరిగా ఖండించని సీమాంధ్ర రాజకీయ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు కనీసం ఈ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి తీసుకు వచ్చేలా వత్తిడి తీసుకు రాక పోవటం వారు చేసిన పెద్ద  తప్పు. పార్లమెంటు లో ఈ నివేదికని  చర్చకి పెట్టి వుంటే తెలంగాణా వాదంలో వున్న డొల్ల తనం దేశం మొత్తానికి తెలియడమే కాక దేశంలో మరిన్ని చోట్ల వున్న వేర్పాటు ఉద్యమాలని సమర్ధంగా ఎదుర్కోవటానికి కూడా కేంద్రానికి వెసులుబాటుగా వుండేది. ఇంక కమిటీ సూచించిన  ఆరు పరిష్కారాలలో హైదరాబాదుతో కూడిన తెలంగాణ ని ఇస్తూ సీమాంధ్ర కి ప్రత్యెక రాజధాని తో  ప్రస్తుత రాష్ట్రాన్ని రెండుగా విభజించమని కూడా ఒక సూచన వుంది.  అయితే ఎప్పుడు ఈ సూచన అమలు పరచాలో కూడా ఖచ్చితంగా తెలిపింది.  విధి లేని పరిస్థితుల్లో - రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పూర్తి అంగీకారంతో మాత్రమె అమలు జరపాలని సూచించింది.  ఒక వేళ అలా  చెయ్యక పొతే జరిగే అనర్దాలని కూడా సవివరంగా  చర్చించింది.  కానీ ఇప్పుడెం జరిగింది ?  కాంగ్రెస్ పార్టీ తన సీట్ల - వోట్ల రాజకీయం కోసం ముందు వెనుకలు ఆలోచించకుండా అడ్డగోలు విభజన ప్రకటించేసింది.  ఫలితం - సీమాంధ్ర 40 రోజులుగా అగ్ని గుండం అయ్యింది.  శ్రీ క్రిష్ణుడు చెప్పిన అనర్ధాలన్నీ అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి.  అయినా కేంద్రం కళ్ళు తెరిచిందా? లేనే లేదు.  ఉయ్యాల లో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతా వెతికినట్లు శాస్త్రీయంగా సమగ్రంగా ఉన్న శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చేసి - ఆంటోనీ కమిటీ, అఖిల పక్ష కమిటీ అంటూ సమస్య ని సాగదీస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని రావణ కాష్టం చేస్తోంది.  ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఎవరు ఔనన్నా కాదన్నా - రోజుకొకరు డిల్లీ నుండి తెలంగాణా నోట్  తయారవుతోందని బీరాలు పలుకుతున్నా - సీమాంధ్ర ఉద్యమానికి దడిసి కేంద్రం వెనుకడుగు వేసిందన్నది వాస్తవం. తెలంగాణా ప్రకటించాక కూడా లోక్ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణా ప్రాంత సభ్యులు అడ్డంకులు కల్పిస్తున్నారంటే వారి వాదనలన్నీ డొల్ల అని తేలి పోతోంది.   కనుక సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ని పార్లమెంటు లో చర్చించ కుండా తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టకూడదని అధిష్టానం పై వత్తిడి తీసుకు రావాలి. సమస్య పరిష్కారానికి ఇదే ఏకైక మార్గం. 

1 comment:

  1. no body expected that central govt will announce Telangana. they think that they are barking from last 50 years.This time also same thing happens. But the seen was reversed ,mind blocked.

    ReplyDelete