Wednesday, January 20, 2010

మళ్ళీ బందా? అమ్మ బాబోయ్..

అసలు తెలంగాణాలో ఎం జరుగుతోంది? రాజకీయ నాయకులేమో దొంగ దీక్షలు, ఉత్తుత్తి రాజీనామాలు, అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు అరెస్టై పొలిసు స్టేషన్లకు వెళ్లి రావడం.. మీటింగులు, చర్చల పేరుతొ తమ ప్రొఫెషన్ లని విజయవంతంగా నడిపించుకుంటున్నారు. మీడియాకి కూడా కావలినంత హల్ చల్! వారికీ పండగే! మధ్యలో వెర్రి వెధవలు అవుతున్నది చోద్యం చూస్తున్న ప్రజలు, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న విద్యార్ధులు! ఒక విద్యార్ధి (ఆత్మ) హత్య కారణం చూపుతూ మళ్లి రెండు రోజుల బందు పిలుపు ఇవ్వటం దారుణం. రెండు రోజులు కాదు ఇరవయ్ రోజులు బందు చేసిన కూడా ఈ రాజకీయుల ప్రొఫెషన్ కి ఎ మాత్రం ఇబ్బంది వుండదు. పైపెచ్చు వారికి కావలసినంత హంగామా! ప్రతి చోటా లీడరు మీడియాలో అభిప్రాయాలు చెప్పేవాడే! కాని అసలు ప్రజల అవస్థలు, ఇబ్బందులు ఎవరికైనా పట్టాయా? విద్యార్ధులు కూడా ఆలోచించుకోవాలి. ప్రత్యెక రాష్ట్రం వచ్చినా రాక పోయినా వారికి వొరిగేదేమీ లేదు. కానీ ఈ రాజకీయ నాయకులెవరైన పోయిన విద్యార్ధుల ప్రాణాలు తీసుకు రాగలరా? రేపు వీరు చదువులు నాశనం చేసుకుని నిరుద్యోగులుగా రోడ్లో నిలబడితే ఎ రాజకీయుడైన పలకరిస్తాడా? చస్తే పలకరించరు. ఆ టైము కి వారి చేత క్రియేట్ చేయబడబోయే సమస్యకి ఎవరు సమిధలుగా అవసరమవుతారో వారి వెంట పడతారు కాని వీరిని పట్టించుకోరు. పైగా ఇప్పుడు రెండు రోజుల బందుని ఒక రోజుకి తగ్గించటానికి ప్రయత్నిస్తున్నారట! సంతోషం. అసలు బందు మార్గం కాకుండా, ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వేరే మార్గాలు చూసుకుంటే మరీ సంతోషం.

3 comments:

  1. ఎందుకో బాధేస్తుంది. చదువు కొమ్మని పంపిస్తే ఉద్యమాల్లో దిగి జీవితం పాడు చేసు కుంటున్నారు. తప్పిపోయిన స్కూల్ ఇయర్ తిరిగిరాదు. మళ్ళా చదువు గిరి లో పాడటానికి సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యకాలం లో మిగతా వాళ్ళంతా మన ఉద్యోగాలు తీసుకుంటారు. బహుశా యిది ఒక గూడు పుఠాని ఏమో.
    కొన్ని వేల మందిని ఉద్యమాల పేరు పెట్టి ఉద్యోగాల లో ఎదురు రాకుండా చేసారు.
    రామకృష్ణారావు

    ReplyDelete
  2. అస్సలు ఈ బందుల వల్ల చనిపోయిన ఆ విద్యార్ధి తిరిగి వస్తాడా? పొద్దున్న సాక్షి టీవీలో ఆ ఓ యూ జే ఏ సీ నాయకుడు శ్రీకాంత్ చెబుతున్నాడు - మా చదువులు పాడు అయినా పరవాలేదు, తెలంగాణా కోసం ఏమైనా చేస్తామని. ఏ విలువలతో సాగుతోంది ఈ ఉద్యమం? అసలు ఇది ఉద్యమమేనా? జనాలని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. చదువుకునే పిల్లలకి ఎంత ఇబ్బంది? ఈ సారి విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులు పోయినయో తెలుసా వీరికి? ఉద్యోగాలకి వెళ్ళే వారికి బందుల వల్ల ఎంత ఇబ్బందో తెలుసా వీరికి? ఒక రోజు పనికి పోకుంటే ఆ రోజు జీతం రాని వారి పరిస్థితి అలోచిస్తున్నారా? ప్రజలని ఇక్కట్ల పాలు చేసే ఉద్యమానికి ఎవ్వరూ సహకరించరు. కావాలని ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న వీరు క్షమార్హులు కానే కారు. ఈ సారి ఎవ్వరైనా బందు అంటే, తీసుకెళ్ళి జైల్లో పడెయ్యాలి .....!

    అస్సలు ఆత్మహత్య మహా పాపం. బుధ్ధిగా చదువుకోండిరా అని వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తే పిల్లలు చేస్తున్న నిర్వాకం ఇదా? పైగా ఆ విషయాన్ని మీడియా ఇంత ఎక్కువగా చూపడం - మానసికంగా ఇతరులమీద ఎంత ప్రభావం చూపిస్తోందో వీరికి తెలుస్తోందా? ఈ రాజకీయ నాయకులు, మీడియా కలిసి మనుషులని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నారు. మనం చనిపోతే హీరోలు అవుతామన్న భావనని విద్యార్ధుల్లో కలిగిస్తున్నారు. తెలంగాణా రాకపోతే చచ్చిపోతారా? ఇన్నాళ్ళూ మరి ఎందుకు బ్రతికి ఉన్నారు? ఏ కారణం తో చనిపోయినా అది తెలంగాణా కోసమే అని చెబుతున్నారు. రెండు లైన్లు సూసైడ్ నోట్ రాసి చచ్చిపోతే తెలంగాణా వచ్చేస్తుందా? పైగా ఇవన్నీ బలిదానాలనే స్టేట్మెంటులు గుప్పిస్తున్నారు....... ఎంత తప్పుదారి పట్టించడం ఇది? అనుభవ రాహిత్యంతో, అవగాహనా రాహిత్యంలో ఒక ఉన్మాద స్థితిలో ఎవరో ఆత్మహత్య చేసుకుంటే, రెండు రోజులు బందు కి పిలుపు ఇస్తారా? రోజూ రెక్కాడితే గానీ డొక్కాడని వారికి ఈ ఆత్మహత్యతో ఏమిటి సంబంధం? సామాన్య ప్రజలని బాగా బాధపెడితే తెలంగాణా వచ్చేస్తుందా? ఈ విద్యార్ధి నాయకులని, రాజకీయ నాయకులని తీసుకెళ్ళి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకని ప్రదేశంలో పడేస్తే, కనీసం అప్పుడైనా ఆకలి బాధ, పేదవారి కష్టం అర్ధం అవుతాయేమో !

    ReplyDelete
  3. విరజాజి గారు మీ ఆవేదన చాలా అర్థవంతంగా ఉంది..ఏం చేస్తాం..ఇలా బ్లాగుల్లొ మన ఆవేదన వెళ్లపోసుకోవటం తప్ప! http://vareesh.blogspot.com/2010/01/blog-post_21.html

    ReplyDelete